పోక్సో (POCSO) ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా నిలిచింది.పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలో ఐదేళ్ల బాలుడిని అపహరించి, లైంగిక దాడి చేసి హత్య చేసిన కేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన నంకే యాదవ్కు పోక్సో ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. అలాగే'పంజాబ్ బాధితులు లేదా వారిపై ఆధారపడిన వారి పరిహార పథకం, 2011' కింద మరణించిన చిన్నారి తల్లిదండ్రులకు రూ. 5 లక్షల పరిహారాన్ని కూడా కోర్టు మంజూరు చేసింది.
ఈ నేరం తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న జడ్జి మన్ప్రీత్ కౌర్ దీనిని " రేరెస్ట్ ఆఫ్ ది రేర్" (rarest of rare) కేటగిరీ కింద పరిగణించారు. అయితే, ఈ మరణశిక్ష అమలు కావాలంటే పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఆమోదం తప్పనిసరి.
అసలు కేసు ఏంటి?
2023, సెప్టెంబర్లోన్యూదీప్ నగర్లో ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. మరుసటి రోజు పుర్హిరాన్ శ్మశానవాటికలో బాలుడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన హోషియార్పూర్లో తీవ్ర సంచలనం సృష్టించింది. కుటుంబ సభ్యులు, స్థానికులు నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. ఈ ప్రాంతంలో వలస కార్మికుల ఉనికిపై కూడా వివాదం రగిలింది. ఫలితంగా అనేక పంచాయతీలు వలసదారుల నివాసాలకు సంబంధించి తీర్మానాలను ఆమోదించాయి.
ఇదీ చదవండి: పూణె వ్యాపారి కిడ్నాప్ కేసు ట్విస్ట్ : మలేషియా ట్రిప్ అని చెప్పి!
ఈ కేసులో విచారణలో ప్రాసిక్యూషన్ అందించిన సాక్ష్యాధారాల ఆధారంగా నిందితుడు యాదవ్ను సెక్షన్ 103 మరియు పోక్సో చట్టం సెక్షన్ 6 కింద కోర్టు దోషిగా నిర్ధారించింది. పోక్సో చట్టం సెక్షన్ 35 ప్రకారం కేసు విచారణ ప్రారంభమైన ఏడాదిలోగా పూర్తి చేయాలనే నిబంధన మేరకు, ఆ చట్టబద్ధమైన గడువు ముగియడానికి ఒక్క రోజు ముందు కోర్టు ఈ తీర్పును వెలువరించింది.
ఇదీ చదవండి: కాటేసిన పాముతో ఆసుపత్రికి : పాము హల్చల్, వణికిన రోగులు


