పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కాన్వాయ్పై టమాటాలు, గుడ్లు విసిరేందుకు ప్రయత్నించారు బీజేపీ నేత, మాజీ కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ. దీంతో ఉద్రిక్తతల మధ్య రవ్నీత్ సింగ్ బిట్టూను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం లూధియానాలోని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది.
లూధియానాలో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన కార్యక్రమానికి భగవంత్ మాన్, మనీష్ సిసోడియా సహా పలువురు నేతలు హాజరుకావాల్సి ఉంది. ముఖ్యమంత్రి కాన్వాయ్ పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం బయట నుంచి వెళ్లాల్సి ఉండగా.. బిట్టూ చేతిలో టమాటాలతో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఆయనను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్తున్న సమయంలో బిట్టూ ముఖ్యమంత్రి వాహనంపై టమాటా విసిరేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
ఈ ఘటనకు ముందు రోజు జరిగిన పరిణామమే తాజా చర్యకు కారణంగా తెలుస్తోంది. బటాలా సమీపంలో బిట్టూ కాన్వాయ్పై కొందరు గుడ్లు, టమాటాలు విసిరారు. ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారని బిట్టూ ఆరోపించారు. సుమారు 100 మంది ఏఏపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, తన కాన్వాయ్లోని తొలి వాహనం అద్దాలను పగులగొట్టేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.
ఆ ఘటనకు నిరసనగా బిట్టూ లూధియానాకు వచ్చారని, తనపై జరిగిన ఘటనకు ప్రతిస్పందనగా భగవంత్ మాన్ కాన్వాయ్పై టమాటాలు విసరాలని ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఆయన కాన్వాయ్కు దగ్గరగా వెళ్లకముందే పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామంతో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య కొనసాగుతున్న రాజకీయ ఘర్షణ మరోసారి బహిర్గతమైంది.


