మిర్జాపూర్: ఉత్తర్ప్రదేశ్లోని మిర్జాపూర్లో బీజేపీ ఎమ్మెల్యే రత్నాకర్ మిశ్రా కారు బురదలో చిక్కుకుపోయింది. రైల్వే అండర్పాస్లో మట్టి, బురదలో ఇరుక్కున్న వాహనాన్ని ట్రాక్టర్ సాయంతో బయటకు తీయాల్సి వచ్చింది. రాయిని తాకడంతో కారు వెనుక టైరు పంక్చర్ కావడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మిర్జాపూర్లోని ఛాన్బే ప్రాంతం అకోఢీ రైల్వే అండర్పాస్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
గంగా నది నీటిమట్టం పెరగడంతో కర్ణావతి నదికి వరదలు వచ్చాయని గ్రామస్థులు తెలిపారు. దీంతో అకోఢీ రైల్వే అండర్పాస్ దాదాపు నెల రోజులపాటు నీరు, మట్టి, మల్బాతో నిండిపోయింది. అకోఢీతో పాటు పరిసర ప్రాంతాల్లోని సుమారు 15 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్రామస్థులు జేసీబీ సాయంతో అండర్పాస్లోని నీరు, బురదను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
ఇదీ చదవండి: ఎల్నినో ఎఫెక్ట్: అట్లాంటిక్ను తాకని హరికేన్లు!


