బెంగళూరు: కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 23 ఏళ్ల వర్ష ఒక లాడ్జ్లో అనూహ్యంగా కన్నుమూసిన ఘటన కలకలం రేపింది. అదీ చాక్లెట్ తిన్న తర్వాత కుప్పకూలిపోవడంతో మరింత ఆందోళనకు గురిచేసింది. అదీ బర్త్డే రోజు నాడే అందని తీరాలకు చేరడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
హసన్ పోలీస్ సూపరింటెండెంట్ సమాచారం ప్రకారం బెంగళూరు నుంచి సుమారు 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాసన్కు తన పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 11న తన కజిన్స్, స్నేహితురాలితో కలిసి విహారయాత్ర కోసం సకలేష్పూర్లోని లాడ్జ్కు వచ్చింది. అక్కడ స్నానానికి వెళ్లేముందు చాక్లెట్ తిన్నది. తరువాత బాత్రూమ్కు నడుచుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది.
ఇదీ చదవండి: ఒరాకిల్ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి!
వర్ష టూర్ గురించి ఆమె తల్లిదండ్రులకు తెలుసని, ఆమె శరీరంపై ఎలాంటి బాహ్య గాయాలు లేవని అధికారులు తెలిపారు. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి, మరణానికి కారణం తెలుసుకోవడానికి వర్ష మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. వర్ష మరణం ఆకస్మిక ఆరోగ్య సమస్య వల్ల జరిగిందా లేక మరేదైనా అంతర్లీన కారణం ఉందా అనే విషయాలను నిర్ధారించేందుకు పోలీసులు పోస్ట్మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. వర్షతో పాటు లాడ్జ్లో ఉన్న ఆమె బంధువును, స్నేహితురాలిని పోలీసులు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: ‘క్వీన్ ఫిషర్’ యూట్యూబర్ జీవితం విషాదాంతం


