పదేపదే ఫోన్ చూడటం, ఆందోళన చెందడం, సంతోషం కోసం నిరంతరం కొత్త విషయాలను వెతకడం వంటి అలవాట్లు మనసుపై ప్రభావం చూపుతుంటాయి. వీటిని అధిగమించేందుకు టిబెటన్ బౌద్ధ భిక్షువు, రచయిత యోంగే మింగ్యూర్ రిన్పొచే కొన్ని సులభమైన సూచనలు చేశారు. ‘ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండే వ్యక్తి’గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మెదడును శాస్త్రవేత్తలు పరిశీలించినప్పుడు ప్రశాంతత, సంతోషానికి సంబంధించిన స్థాయిలు గణనీయంగా ఉన్నట్లు గుర్తించారు.
ఖాళీ సమయాన్ని ఫోన్తో నింపొద్దు
ఒంటరితనం, విసుగు, ఆందోళన వచ్చినప్పుడు వెంటనే ఫోన్ తీయడం, కాఫీ లేదా తిండి వైపు వెళ్లకుండా ఆ భావాలను గమనిస్తూ ఉంటే అవి నెమ్మదిస్తాయని రిన్పొచే సూచించారు.
చిన్న మార్పులు చేసుకోండి
ఉద్యోగం, జీవనశైలి అన్నీ మార్చాల్సిన అవసరం లేదు. ఇంటికి వెళ్లే మార్గాన్ని మార్చడం, కొత్త వంటకం ప్రయత్నించడం, చాలాకాలంగా మాట్లాడని స్నేహితుడికి సందేశం పంపడం వంటి చిన్న కొత్త అనుభవాలను ప్రయత్నించాలి.
నిశ్శబ్దం ధ్యానానికి తప్పనిసరి కాదు
ట్రాఫిక్ శబ్దం, ఇతరుల మాటలు వంటి వాటినీ ధ్యానానికి అనువుగా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఎక్కడైనా, ఎప్పుడైనా ధ్యానం చేయవచ్చన్నారు.
‘మూడు స్తంభాల’ పద్ధతి
దృక్పథం, ధ్యానం, ఆచరణ అనే మూడు అంశాలను పాటించాలని సూచించారు. ఇతరుల్లో మంచి లక్షణాలను గుర్తించడం ద్వారా దీనిని ప్రారంభించవచ్చన్నారు.
కృతజ్ఞతను స్పష్టంగా వ్యక్తం చేయండి
ఆరోగ్యం, ఇల్లు, కుటుంబం, స్నేహితులు వంటి చిన్న విషయాల విలువను గుర్తించడం ద్వారా జీవితంపై ఆశ పెరుగుతుందని చెప్పారు.
భయాందోళనను మేఘంలా చూడండి
ఆందోళనతో పోరాడకుండా దాన్ని గమనించి, అంగీకరించి, దానిని తొలగించుకోవాలని సూచించారు.
సంతోషాన్ని వెంటాడొద్దు
కొత్త ఉద్యోగం, కొత్త ప్రదేశం లేదా కొత్త సంబంధం తాత్కాలిక ఆనందాన్ని ఇవ్వవచ్చు. అయితే చైతన్యంతో శ్వాసించడం, తనపై, ఇతరులపై కరుణ చూపడం వంటి సాధనలు సంతోషభావాన్ని పెంచుతాయని తెలిపారు.
కోపం వచ్చినప్పుడు కాసేపు ఆగండి
‘నేను ఇప్పుడు కోపంగా ఉన్నాను’ అని గుర్తించడం ద్వారా వెంటనే స్పందించకుండా ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం లభిస్తుందని వివరించారు.
ఇతరులకు సహాయం చేయండి
మన సమస్యలపై మాత్రమే దృష్టి పెట్టకుండా చిన్న సహాయం చేయడం, స్నేహితుడితో అతని పరిస్థితిని అడగడం వంటి చర్యలు మరింత ఆనందాన్ని అందిస్తాయని రిన్పొచే పేర్కొన్నారు.
ఇదీ చదవండి: విశ్వ వీక్షణ నిలయం.. ఈ గణేశ మండపం


