భారత బాక్సింగ్ జట్టు
న్యూఢిల్లీ: ఈ నెల 19 నుంచి జపాన్ వేదికగా ప్రారంభం కానున్న ఆసియా క్రీడల కోసం ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) ప్రత్యేక ‘సేఫ్ గార్డింగ్ కోడ్ ఆఫ్ కండక్ట్’ను తీసుకొచ్చింది. క్రీడాకారులు, అధికారుల భద్రత, క్రమశిక్షణకు సంబంధించిన వివరాలను ఈ నియమావళిలో పొందుపరిచింది.
నిబంధనలను ఉల్లంఘిస్తే క్రీడల నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా... మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ముందే హెచ్చరిస్తోంది. భారత సాఫ్ట్బాల్ సంఘం అధ్యక్షురాలు నీతల్ నారంగ్... ఈ క్రీడల్లో మన అథ్లెట్ల బృందానికి ‘సేఫ్ గార్డింగ్ ఆఫీసర్’గా వ్యవహరించనున్నారు.
ఆసియా క్రీడల సందర్భంగా ఎలాంటి ఆధిపత్యం, అధికార దుర్వినియోగానికి తావులేకుండా నియామావళిని రూపొందించారు. హోదాను ఉపయోగించి వేధింపులకు గురిచేయడంపై తీవ్ర ఆంక్షలు విధించారు. క్రీడాకారులు, అధికారులు అవమానకరమైన, అసభ్యకరమైన భాషను ఉపయోగించకుండా నిషేధం విధించారు.
కేవలం మైదానంలో అథ్లెట్ల ప్రదర్శననే కాకుండా... వారి సోషల్ మీడియాను సైతం ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ఓ కంట కనిపెడుతూ ఉండనుంది. క్రీడల సందర్భంగా అథ్లెట్లు, సహాయక సిబ్బంది సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు ఇతరుల గౌరవాని భంగం కలిగించకుండా బాధ్యతాయుతంగా ఉండేలా చూసుకోవాలని సూచించింది.
ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న ప్రతీ అథ్లెట్, అధికారి ఈ నియామావళిపై సంతకం చేయడం తప్పనిసరి కాగా... వీటి గురించి భారత అథ్లెట్లకు ఇదివరకే వర్క్ షాప్ నిర్వహించారు. అక్టోబర్ 4తో ఏషియన్ గేమ్స్ ముగియనుండగా... హాకీ, స్క్వాష్ విభాగాల్లో ఇక్కడ పసిడి పతకాలు సాధించిన వారు 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధిస్తారు.


