source: X
చెన్నై సూపర్ కింగ్స్ యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే మరో కీలక దేశవాళీ టోర్నీకి దూరం కానున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో వచ్చే నెలలో జరిగే ఇరానీ కప్కు అతడు అందుబాటులో ఉండడని సమాచారం. నివేదికల ప్రకారం.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఆయుష్కు ఇంకా ఫిట్నెస్ క్లియరెన్స్ రాలేదు.
అక్టోబర్ 1 నుంచి ఇరానీ కప్
రంజీ ట్రోఫీ 2025-26 విజేత జమ్మూ కశ్మీర్తో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు ఇరానీ కప్లో తలపడనుంది. ఈ వన్-ఆఫ్ మ్యాచ్ అక్టోబర్ 1 నుంచి 5 వరకు శ్రీనగర్లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో జరగనుంది. బీసీసీఐ త్వరలో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఫిట్నెస్ క్లియరెన్స్ లేకపోవడంతో ఆయుష్ మాత్రే పేరును పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది.
ఐపీఎల్ 2026లో ఆరు మ్యాచ్లే..!
ఆయుష్ మాత్రేకు గాయం సమస్యలు ఐపీఎల్ 2026లోనే మొదలయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన అతడు టోర్నీ మధ్యలో హ్యామ్స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. దీంతో ఐపీఎల్ సీజన్కు దూరమయ్యాడు. ఐపీఎల్ 2026లో ఆయుష్ ఆరు మ్యాచ్ల్లో 201 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్ సగటు 33.50 కాగా, స్ట్రైక్రేట్ 177.87గా ఉంది.
ముంబై టీ20 లీగ్కు కూడా దూరం
ఐపీఎల్ గాయం నుంచి కోలుకుంటున్న సమయంలోనే ఆయుష్కు మరో గాయమైంది. ముంబై టీ20 లీగ్ 2026కు ముందు అతడికి మణికట్టు గాయం కావడంతో ఆ టోర్నీకి కూడా దూరమయ్యాడు.
ప్రస్తుతం ఆయుష్ ఇండోర్ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, పోటీ క్రికెట్లోకి తిరిగి రావాలంటే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందాల్సి ఉంది.
ఇదీ చదవండి: మహిళల ఐపీఎల్కు సంబంధించి బిగ్ అప్డేట్స్


