అమెరికాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
ఆమె మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
పులివెందుల(వైఎస్ఆర్ కడప జిల్లా): దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మేనత్త, వైఎస్ రాజారెడ్డి సోదరి వైఎస్ కమలమ్మ (88) ఆదివారం కన్ను మూశారు. కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమెను పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ దంపతులు పరామర్శించారు.
కమలమ్మ మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లి అక్కడే ఆమె కుమార్తె మెర్సీ వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం అక్కడే ప్రాణాలు విడిచారు. కమలమ్మ భౌతికకాయాన్ని పులివెందులకు తీసుకొచ్చి వైఎస్సార్ సమాధుల తోటలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కమలమ్మ మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ దంపతులతో పాటు, వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ కుటుంబ సభ్యులు దిగ్భాంతి వ్యక్తం చేశారు.


