బిష్కెక్ (కిర్గిజిస్థాన్): ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలోనే మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి అందుతున్న ఆర్థిక వనరులు, రిక్రూట్మెంట్లు, మత ఛాందసవాదం, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే సురక్షిత స్థావరాలు వంటి యావత్ ఉగ్ర వ్యవస్థను పూర్తిగా సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు.
ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ ఒకే గొంతుకతో మాట్లాడాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. యుద్ధభూమిలో ఎలాంటి సమస్యలకు పరిష్కారం దొరకదని, ఏ వివాదమైనా చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కారం కావాలని అన్నారు. అంతకుముందు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రత్యేకంగా భేటీ అయిన సందర్భంగా ప్రధాని మోదీ ఉక్రెయిన్ అంశాన్ని ప్రస్తావించారు. శాంతి స్థాపన కోసం జరిగే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రతి యుద్ధ దినం మానవాళిని వెనక్కి నెడుతుందని, శాంతి వైపు వేసే ప్రతి అడుగు కొత్త ఆశను నింపుతుందని పేర్కొన్నారు.
అంతం లేని యుద్ధాల నుంచి బయటపడి శాంతి దిశగా పయనించాల్సిన అవసరం ఉందని, గాంధీ, బుద్ధుడు నడయాడిన భారత గడ్డ శాంతి సందేశాన్నే ప్రపంచానికి అందిస్తుందని మోదీ అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పాటు అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో మోదీ-పుతిన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 2001లో చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్లతో ప్రారంభమైన ఎస్సీవోలో భారత్, పాకిస్థాన్లు 2017లో, ఇరాన్ 2023లో, బెలారస్ 2024లో పూర్తిస్థాయి సభ్యదేశాలుగా చేరాయి.
ఇది కూడా చదవండి: ఒకే ఫ్రేమ్లో మోదీ, జిన్పింగ్, పుతిన్, షరీఫ్


