ఆమె కన్నీటి శాపమే.. నేపాల్‌ను వెంటాడుతోందా? | Nepals Sati Curse: The 400 Year Old Tragedy Behind It | Sakshi
Sakshi News home page

ఆమె కన్నీటి శాపమే.. నేపాల్‌ను వెంటాడుతోందా?

Aug 31 2026 1:40 PM | Updated on Aug 31 2026 1:52 PM

Nepals Sati Curse: The 400 Year Old Tragedy Behind It

ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడం, భూకంపాలు.. వరుస ప్రకృతి విపత్తులు ఓవైపు తరచూ తలెత్తుతున్న రాజకీయ సంక్షోభాలు మరోవైపు. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఏ ముప్పు ఎటు నుంచి  ముంచుకొస్తుందో తెలియని పరిస్థితులతో పశుపతి నేల నేపాల్‌ సతమతమవుతోంది. తాజా జల విలయం కూడా ఆ దేశం ఎదుర్కొంటున్న కష్టాలను మరోసారి కళ్లకు కట్టింది. ఇలాంటి పరిస్థితులు తమకు బాగా అలవాటేనని, కోలుకోవడం కూడా సాధారణమేనని నేపాల్‌ చెబుతున్నప్పటికీ.. ఈ పరిస్థితుల వెనక ప్రచారంలో ఉన్న ఓ గాథ తాజాగా తెరపైకి వచ్చింది. 

‘సతి లే సరాపేకో దేశ్‌’.. సతి శాపానికి గురైన దేశం. నేపాల్‌ రాజకీయాల్లో తరచూ వినిపించే మాట ఇది. రాజరికం అంతరించి పోయిన సమయంలో.. అలాగే వరుసగా ప్రభుత్వాలు కూలినప్పుడల్లా ఈ పదం నెట్టింట వైరల్‌ అవుతుంటుంది. ఇది కేవలం ఇందుకే పరిమితం కాలేదు.. ప్రకృతి ప్రకోపం చూపించినప్పుడు కూడా అక్కడి జనాలు దీనిని గుర్తు చేసుకుంటారు. అసలు నేపాల్‌ శపించిన ఆ మహిళ ఎవరు? ఆమె విషాద గాథ ఏంటి? సతీసహగమన సమయంలో ఆమె పెట్టిన కన్నీరే నేపాల్‌ దుస్థితికి కారణమా?.. నాలుగు వందల ఏళ్ల కిందట జరిగింది ఏంటి?.. 

నేపాల్‌లో 17వ శతాబ్దంలో ఖాట్మాండు లోయను మల్ల రాజులు పరిపాలించేవారు. అధికారం, ఆధిపత్య పోరులతో రాజదర్బాలు కుట్రలకు, కుతంత్రాలుగా నిలయంగా కనిపించేవి. ఆ వంశంలో రాజు లక్ష్మీ నరసింహ మల్లా కొలువులో కాజీ భీమ్‌ మల్లా అనే సేనాపతి ఉండేవాడు. సైనిక వ్యవహారాల్లోనే కాకుండా పరిపాలన, టిబెట్‌తో వాణిజ్య సంబంధాల్లోనూ ఆయన రాజుకు చేదోడు వాదోడుగా ఉంటూ కీలక వ్యక్తిగా ఎదిగారు. రాజు వద్ద ఆయనకు పెరుగుతున్న ప్రాధాన్యం.. సాధారణంగానే సామంత రాజుల్లో అసూయను పెంచింది.

చాడీలు విని.. 
భీమ్‌ మల్లాపై కుట్రలు పన్నిన ప్రత్యర్థులు.. రాజు లక్ష్మీ నరసింహుడికి లేనిపోని వన్నీ నూరిపోశారు. దాంతో తన సింహాసనానికి భీమ్‌ ముప్పుగా మారుతున్నాడేమో అని అనుమానం పెంచుకున్నారాయన. అలా రాజద్రోహం ఆరోపణలతో ఎలాంటి విచారణ జరపకుండానే ఆయన్ని చెరసాలలో బంధించి.. మరణశిక్ష అమలు చేశారు. అది చూసి.. ఆయన భార్య భువనలక్ష్మి గుండె పగిలేలా రోదించింది. రాజ్యం సైతం కన్నీరు పెట్టింది.

చితిపై నుంచే శాపం?
నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తిని లక్ష్మీ నరసింహుడు అకారణంగా, కుట్రలకు తలొగ్గి చంపడాన్ని భువనలక్ష్మి తట్టుకోలేకపోయారు. ఆ కాలంలో నేపాల్‌లో సతి ఆచారం ఉండేది. భర్త మరణించిన తర్వాత భార్య కూడా అతడి చితిపై ఆత్మాహుతి చేసుకునే పరిస్థితులు ఉండేవి. భువనలక్ష్మి కూడా భర్త భీమ్‌ మల్లా చితిపై ఆత్మార్పణం చేసుకున్నారు. అయితే అంతకు ముందు తన భర్తకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

తన భర్తను అన్యాయంగా చంపిన ఈ నేల, ఈ రాజ్యాన్ని మనశ్శాంతిగా ఉండబోవని, సర్వనాశనం అవుతాయని శపించారు. ఆ తర్వాత రాజు లక్ష్మీ నరసింహుడు సైతం తన పశ్చాత్తాపం వ్యక్తం చేశాడని.. ఆయన కాలంలోనే వరదలు సంభవించాయని చెబుతుంటారు.  అలా ఆమె శాపం నాలుగు వందల ఏళ్లుగా కొనసాగుతూనే ఉందని ఓ జానపద కథ ప్రచారంలోకి వచ్చింది. ఆ గాథ నుంచే ‘సతి లే సరాపేకో దేశ్‌’(Sati le Sarape ko Desh) అనే పదబంధం పుట్టిందని చెబుతారు.

అయితే కాలక్రమంలో ఈ గాథ భువనలక్ష్మి అనే మహిళ కన్నీటి కథకు మాత్రమే పరిమితం కాలేదు. నేపాల్‌లో తరచూ తలెత్తిన రాజకీయ అస్థిరత, అధికార పోరాటాలు, పాలనా సంక్షోభాలు.. అదనంగా ముంచెత్తున్న ప్రకృతి విపత్తులను ప్రస్తావించేటప్పుడు ఈ పదబంధాన్ని వ్యంగ్యంగా, ఆవేదన పూరితంగా ఉపయోగించడం మొదలైంది. ఇప్పుడు ఆకస్మిక వరదల వల్ల మళ్లీ తెరపైకి వచ్చింది.

 

ఇదీ చదవండి: తస్మాత్‌ జాగ్రత్త.. మనుషుల్ని మోసం చేస్తున్న ఏఐ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement