‘ఖాళీ చేసిన నాలుగు గంటలకే హోటల్‌ కొట్టుకుపోయిది’ | Escapes Deadly Nepal Flash Flood Hours After Leaving Washed Away Hotel | Sakshi
Sakshi News home page

‘ఖాళీ చేసిన నాలుగు గంటలకే హోటల్‌ కొట్టుకుపోయిది’

Aug 31 2026 1:09 PM | Updated on Aug 31 2026 1:19 PM

Escapes Deadly Nepal Flash Flood Hours After Leaving Washed Away Hotel

ముంబై: కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన మహారాష్ట్రలోని విరార్‌ వాసి ప్రదీప్‌ టెండూల్కర్‌‌ నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల నుంచి త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్నారు. ఆయన బస చేసిన హోటల్‌ను ప్రమాదానికి కొద్ది గంటల ముందే ఖాళీ చేయడం వల్ల ప్రాణాలు దక్కాయి. ఆగస్టు 22న విరార్‌ నుంచి యాత్ర ప్రారంభించిన ప్రదీప్‌ టెండూల్కర్‌ నేపాల్‌ మీదుగా ప్రయాణిస్తూ ఒక హోటల్‌లో బస చేశారు.

అయితే ఆ హోటల్‌ నుంచి ఆయన బయలుదేరిన నాలుగు గంటల వ్యవధిలోనే అక్కడ ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. నీటి ఉద్ధృతికి ఆ హోటల్‌ పేకమేడలా కొట్టుకుపోయింది. కొద్ది గంటల వ్యత్యాసమే ఆయన ప్రాణాలను కాపాడింది. ప్రదీప్ ప్రస్తుతం దాదాపు 18,500 అడుగుల ఎత్తులోని డోల్మా లా పాస్‌కు సురక్షితంగా చేరుకుని, యాత్రను కొనసాగిస్తున్నారు. తాను విశ్రాంతి తీసుకున్న ప్రాంతం పూర్తిగా శిథిలమైపోయిన వార్త తెలుసుకుని ప్రదీప్‌ తీవ్ర విస్మయానికి గురయ్యారు. తమ ప్రాణాలు దక్కినప్పటికీ, ఈ విపత్తు వల్ల ప్రజలకు జరిగిన నష్టం తీవ్ర బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విపత్తు కారణంగా ప్రధాన రహదారులు ధ్వంసమై మానససరోవర యాత్రకు వెళ్తున్న ఇతర యాత్రికుల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించేందుకు భారత్, నేపాల్, చైనా సహాయక బృందాలు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో వసాయ్-విరార్ నగర ప్రజల్లో ఆందోళన వ్యక్తమవగా, నగరానికి చెందిన పౌరులెవరూ ఈ ప్రమాదంలో చిక్కుకోలేదని మేయర్ అజీవ్ పాటిల్ తెలిపారు.

ఇది కూడా చదవండి: వరద మిగిల్చిన బురద.. కుదుటపడేదెన్నడో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement