డిజాస్టర్ పోర్టల్లో మృతదేహాల ఫొటోలు, గుర్తింపు ప్రక్రియ వేగవంతం
డీఎన్ఏ పరీక్షల కోసం నేపాల్ వెళ్లాల్సిన అవసరం లేదన్న అధికారులు
సాక్షి, న్యూఢిల్లీ: నేపాల్ను అతలాకుతలం చేసిన వరద విపత్తులో చిక్కుకున్న తెలంగాణవాసుల భద్రత, గల్లంతైన వారి అన్వేషణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కఠ్మాండులోని భారత రాయబార కార్యాలయం, నేపాల్ పోలీసులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాంగ శాఖ సమాచారం ప్రకారం, ఆగస్టు 29న టిబెట్ నుంచి 449 మంది భారతీయులు నేపాల్లోకి ప్రవేశించారు.
వారిలో 397 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేపాల్ నుంచి వచి్చన బాధితుల జాబితాను పరిశీలించగా, తెలంగాణకు చెందిన అల్లి అయిలేష్ వివరాలు తెలంగాణ భవన్ రికార్డులతో సరిపోలాయి. ఆయన ఇప్పటికే తన కుటుంబ సభ్యులతో సంప్రదింపుల్లో ఉన్నారని, క్షేమంగా హైదరాబాద్కు చేరుకుంటారని అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు, వరదల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల ఛాయాచిత్రాలు, ప్రాథమిక వివరాలను నేపాల్ ప్రభుత్వం తమ డిజాస్టర్ పోర్టల్లో అందుబాటులో ఉంచింది.
రసువా, నువాకోట్, ధాదింగ్, చిత్వన్, గోర్ఖా, తనహున్, నావల్పరాసీ (తూర్పు, పశ్చిమ), కఠ్మాండు జిల్లాల్లో భద్రపరిచిన పారి్థవదేహాలను గుర్తించే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు నేరుగా చూసి పోల్చుకోగలిగితే డీఎన్ఏ పరీక్ష అవసరం లేదని, బంధుత్వ ఆధారాలను బట్టి మృతదేహాలను అప్పగిస్తారని నేపాల్ పోలీసులు తెలిపారని చెప్పారు. భౌతికంగా గుర్తించలేని పక్షంలో తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల డీఎన్ఏ ప్రొఫైల్ను సేకరించిన నమూనాలతో సరిపోలుస్తారని తెలిపారు.
డీఎన్ఏ నివేదికల కోసం బంధువులు ఎవరూ శ్రమపడి నేపాల్కు ప్రయాణించాల్సిన అవసరం లేదని, స్వస్థలంలోనే తీసుకున్న డీఎన్ఏ ప్రొఫైళ్లను ఈ–మెయిల్ ద్వారా స్వీకరించే విధానాన్ని నేపాల్ పోలీసులు రూపొందిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. పారి్థవదేహాల తరలింపు విధివిధానాలు పూర్తిగా ఖరారయ్యే వరకు కుటుంబ సభ్యులు నేపాల్ ప్రయాణాలు చేయవద్దని, ముందుగా తెలంగాణ భవన్ లేదా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అధికారిక నిర్ధారణ పూర్తయిన తర్వాతే తదుపరి సమాచారాన్ని వెల్లడిస్తామన్నారు.


