సాక్షి, చెన్నై: పరీక్షల ఒత్తిడి కారణంగా మరో విద్యార్థిని జీవితం అర్థాంతరంగా ముగిసిసోయింది. తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన శ్రుతి లయ (21) అనే మెడికల్ ఆశావాది (NEET-UG అభ్యర్థి) నీట్ మొదటి విడత కౌన్సెలింగ్లో సీటు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.వైద్యురాలు కావాలనే లక్ష్యంతో వరుసగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది.
ఐటీ ఉద్యోగి కుమార్తె అయిన శ్రుతి లయ 2023లో పాఠశాల విద్యను పూర్తిచేసి, వైద్యురాలు కావాలనే కోరికతో నీట్ (NEET) కోచింగ్ సెంటర్లో చేరింది. గత ఏడాది NEET-UG పరీక్ష రాసినప్పటికీ వైద్య సీటు రాకపోవడంతో ఈ సంవత్సరం మళ్లీ తీవ్రంగా శ్రమించి నీట్-యుజి (NEET-UG) పరీక్షలో అర్హత సాధించింది. అయితే, ఇటీవల విడుదలైన మొదటి విడత కౌన్సెలింగ్ జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది.
ఇదీ చదవండి: Nepal Flash Floods 1600 మందిని కాపాడిన ఒకే ఒక్కడు!
ఫలితం తెలిసిన రోజు రాత్రి నిద్రపోవడానికి వెళ్లిన ఆమె, మరుసటి రోజు ఉదయం కనిపించలేదు. కుటుంబ సభ్యులు గాలించగా ఇంటికి సమీపంలో ఉన్న ఒక షెడ్డులో ఉరివేసుకుని కనిపించింది. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఇదీ చదవండి: యూపీలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాజీనామా కలకలం


