ఖాట్మండు: నేపాల్ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం సంభవించిన ఈ జల ప్రళయంలో మరణించిన వారి సంఖ్య ఆదివారానికి 734కు చేరినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. ఇంకా 589 మంది విదేశీయులతో సహా మొత్తం 2,498 మంది ఆచూకీ గల్లంతవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరద మృతుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో మృతదేహాలను భద్రపరిచేందుకు స్థలం సరిపోవడం లేదు. దీంతో గుర్తుతెలియని, ఎవరూ క్లెయిమ్ చేయని మృతదేహాలను ఎయిర్టైట్ బ్యాగుల్లో భద్రపరిచి ఖననం చేయాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, భవిష్యత్తులో వారి గుర్తింపు నిర్ధారణ కోసం ముందస్తుగా డీఎన్ఏ నమూనాలను, ఇతర ఆధారాలను సేకరించి భద్రపరుస్తున్నట్లు ప్రధానమంత్రి బాలేంద్ర షా తెలిపారు.
రసువా ప్రాంతంలోని భోటేకోశి నదిలో వరద ఉధృతి మరింత పెరిగిందని నేపాల్ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ప్రకటించింది. రసువా, నువాకోట్, ధాడింగ్, చిత్వాన్ జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను, సహాయక సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సహాయక చర్యల్లో 5,000 మందికి పైగా సైనికులతో సహా 11,000 మందికి పైగా భద్రతా సిబ్బంది నిమగ్నమయ్యారు. విదేశీ రక్షణ బృందాలను అనుమతించేందుకు తొలుత నిరాకరించిన నేపాల్, బాధితుల దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు తన నిర్ణయాన్ని మార్చుకుంది. భారత్, చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాల సహాయక బృందాలకు అనుమతినిచ్చింది. భారత్ ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని, వైద్య సామగ్రిని పంపించి అండగా నిలిచింది. సంక్షోభ సమయంలో ఆదుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీని నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే ప్రశంసించారు.
ఇది కూడా చదవండి: Delhi: మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం


