ఎన్డీయేలో రగడ.. రాజీనామా చేయాలని కేంద్రమంత్రుల డైలాగ్‌ వార్‌! | NDA Minister Chirag Paswan asks Jitan Manjhi to resign amid Reservations | Sakshi
Sakshi News home page

ఎన్డీయేలో రగడ.. రాజీనామా చేయాలని కేంద్రమంత్రుల డైలాగ్‌ వార్‌!

Aug 30 2026 9:00 AM | Updated on Aug 30 2026 9:00 AM

NDA Minister Chirag Paswan asks Jitan Manjhi to resign amid Reservations

ఎన్డీయేలో అంతా సాఫీగా సాగుతోందనుకుంటే.. రిజర్వేషన్ల అంశం ఒక్కసారిగా రాజకీయ వేడి పెంచింది!. బీహార్‌కు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఒకే కూటమిలో ఉంటూనే పరస్పరం ఢీకొనే పరిస్థితి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో సబ్‌-కోటాలు, క్రిమిలేయర్‌పై హిందుస్థాన్‌ అవామ్‌ మోర్చా (సెక్యులర్‌) చేసిన డిమాండ్‌కు ఎల్జేపీ (రామ్‌విలాస్‌) నేత, కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ తీవ్రంగా స్పందించారు. అంతేకాదు.. ఆ డిమాండ్‌కు మద్దతు ఇస్తున్న కేంద్ర మంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ, ఆయన కుమారుడు సంతోష్‌ సుమన్‌ మంత్రి పదవులకు రాజీనామా చేయాలంటూ చిరాగ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎన్డీఏలో కలకలం రేపుతున్నాయి. దీంతో ఎన్డీఏలో విభేదాలు తెరపైకి వచ్చాయన్న చర్చ మొదలైంది.

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలోనే సబ్‌-కోటాలు తీసుకురావాలని మాంఝీ పార్టీ డిమాండ్ చేయడమే వివాదానికి కారణం. రిజర్వేషన్ ప్రయోజనాలు అత్యంత వెనుకబడిన వర్గాలకు కూడా అందేలా విధానాన్ని సమీక్షించాలని బీహార్ మంత్రి, మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్ పేర్కొన్నారు. అయితే రిజర్వేషన్లలో సబ్‌-కోటాలు, ‘క్రిమిలేయర్’ విధానాన్ని తీసుకురావడం సరికాదని చిరాగ్ పాశ్వాన్‌ వ్యతిరేకిస్తున్నారు. మాంఝీ, సుమన్‌ ఇద్దరూ రిజర్వేషన్‌లో క్రిమిలేయర్‌కు మద్దతిస్తే.. ముందుగా తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని చిరాగ్ పాశ్వాన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్రిమిలేయర్ ఎందుకు ఉండకూడదని అడిగేవారు ముందుగా రిజర్వేషన్ ప్రయోజనాలను వదులుకోవాలి అని ఆయన అన్నారు.

చదవండి: యువతే లక్ష్యంగా బీజేపీ బరిలోకి.. 

ఎస్సీ వర్గాల్లో అన్ని కులాలు ఐక్యంగా ఉన్నాయని, ఆ వర్గాల రిజర్వేషన్‌ను ఆర్థిక ప్రాతిపదికన నిర్ణయించాలని రాజ్యాంగం చెప్పలేదని చిరాగ్‌ స్పష్టం చేశారు. సబ్‌-కోటాలు, క్రిమిలేయర్‌ తీసుకొస్తే సామాజిక న్యాయం లక్ష్యమే దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు.. ఈ వివాదానికి 2024 సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంగా ఉంది. ఎస్సీ, ఎస్టీల్లోనూ మరింత వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు అందేలా రాష్ట్రాలు సబ్‌-క్లాసిఫికేషన్ చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందినవారిని మినహాయించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అయితే ఎస్సీ, ఎస్టీలకు క్రిమిలేయర్ సూత్రాన్ని వర్తింపజేయలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఇదిలా ఉండగా.. మాంఝీకి చెందిన ముషహర్‌ వర్గం అత్యంత వెనుకబడిన దళిత సమూహాల్లో ఒకటిగా ఉంది. తమ వర్గానికి రిజర్వేషన్‌ ప్రయోజనాలు సరిగా అందడం లేదన్న వాదనతోనే సబ్‌-కోటాల డిమాండ్‌ తెరపైకి వచ్చింది. దీంతో బీహార్‌ రాజకీయాలకే పరిమితమైన రిజర్వేషన్‌ వివాదం.. ఇప్పుడు ఎన్డీయేలోని ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్య ప్రత్యక్ష పోరుగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement