అలీగఢ్: యూపీలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)కి చెందిన విద్యార్థి కృష్ణ తాను ఉంటున్న పీజీ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు అతను రాసిన సూసైడ్ నోట్లో ‘నేను లూజర్ని, ఏమీ చేయలేకపోతున్నాను, అందుకే ప్రాణాలు తీసుకుంటున్నాను’ అని పేర్కొన్నాడు. 19 ఏళ్ల కుమారుడి మరణవార్త విని కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మూడు నెలల క్రితమే ఆ యువకుడు ఎన్డీఏ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు.
కృష్ణ తండ్రి విక్రాంత్ శర్మ జమ్ములోని పీర్ మీఠా ప్రాంతంలో నివాసముంటున్నారు. ఆయన బీజేపీ తూర్పు మండలానికి అధికార ప్రతినిధిగా ఉన్నారు. కృష్ణ నాలుగు రోజుల క్రితమే స్వస్థలం నుంచి అలీగఢ్కు తిరిగి వచ్చాడు. ఘటన జరగడానికి మూడు గంటల ముందే కృష్ణతో వీడియో కాల్లో మాట్లాడినట్లు తండ్రి తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత కృష్ణ ఏఎంయూ ఫారిన్ లాంగ్వేజెస్ విభాగంలో బీఏ రెండో సంవత్సరం ఫ్రెంచ్ లాంగ్వేజ్ చదువుతున్నాడు.
కృష్ణ ఏఎంయూ వెలుపల ఉన్న దోద్పూర్ ప్రాంతంలోని ఒక ఇంట్లో పీజీలో ఉండేవాడు. ఎన్డీఏ రాత పరీక్షలో అర్హత సాధించిన అతనికి తదుపరి ఇంటర్వ్యూ జరగాల్సి ఉంది. కుమారుడి మరణవార్త తెలిసిన వెంటనే తండ్రి జమ్ము నుంచి అలీగఢ్ చేరుకున్నారు. కృష్ణ గదిలో పోలీసులకు లభించిన సూసైడ్ నోట్లో ‘బాబు’ అనే పదం కూడా ఉన్నట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు అతని స్నేహితులను విచారిస్తున్నారు. అతను ఫోన్లో ఎవరితోనో ఎక్కువ సమయం మాట్లాడేవాడని సహచర విద్యార్థులు తెలిపారు.
పోలీసులు అతని మొబైల్ లాక్ను అన్లాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాల్ డేటా వివరాలు తెలిస్తే ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడయ్యే అవకాశముంది. కృష్ణ గత ఆగస్టు 15న జమ్మూ నుంచి అలీగఢ్కు వచ్చినట్లు తండ్రి పేర్కొన్నారు. రక్షాబంధన్ పండుగ రోజున వీడియో కాల్ ద్వారా సోదరితో రాఖీ కట్టించుకుంటానని మాట ఇచ్చాడు. అయితే ఆ పండుగకు ముందే ఈ విషాద వార్త చేరింది. కృష్ణ మరణంతో తల్లి, సోదరి తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: నేపాల్ వరదలు: 18 నెలల పసికందు ఎదురుచూపులు..


