నేటి నుంచి ప్రధాని మోదీ ఉజ్బెకిస్థాన్, కిర్గిజిస్థాన్‌ పర్యటన | PM Modis 4 Day Visit to Uzbekistan Kyrgyzstan for SCO Summit and Putin Bilateral Talks | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ప్రధాని మోదీ ఉజ్బెకిస్థాన్, కిర్గిజిస్థాన్‌ పర్యటన

Aug 29 2026 8:16 AM | Updated on Aug 29 2026 8:16 AM

PM Modis 4 Day Visit to Uzbekistan Kyrgyzstan for SCO Summit and Putin Bilateral Talks

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నుంచి ఉజ్బెకిస్థాన్, కిర్గిజిస్థాన్‌లలో నాలుగు రోజుల పర్యటనను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావడంతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అధ్యక్షుడు షావ్‌కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆగస్టు 29 నుంచి 30 వరకు ఉజ్బెకిస్థాన్‌లో పర్యటిస్తారు.

అనంతరం ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు ఆగస్టు 31న బిష్కెక్‌కు చేరుకుంటారు. ఈ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని సమావేశం కానున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. భారత్-రష్యా సంబంధాల సమగ్ర సమీక్ష ఈ భేటీలో ప్రధానాంశంగా ఉండనుంది. 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఎస్‌సీవో సదస్సు ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై ప్రధానంగా దృష్టి సారించనుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితర నేతలు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

సదస్సు ప్రసంగంలో భద్రత, అనుసంధానత, అవకాశాలు (సెక్యూరిటీ, కనెక్టివిటీ, అపార్చునిటీ) వంటి భారత ప్రాధాన్యతలను మోదీ వివరించనున్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాలను ఎదుర్కోవడమే ఎస్‌సీవో ప్రధాన లక్ష్యమని విదేశాంగ శాఖ కార్యదర్శి (వెస్ట్) సిబి జార్జ్ తెలిపారు. భారత్ 2017లో ఇందులో పూర్తిస్థాయి సభ్యదేశంగా చేరింది. కిర్గిజిస్థాన్ పర్యటనలో ప్రధాని మోదీ ఆరో ‘వరల్డ్ నోమాడ్ గేమ్స్’ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఉజ్బెకిస్థాన్‌కు ప్రధాని వెళ్లడం ఇది నాలుగోసారి. ఈ పర్యటనలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ అనుసంధానత, ఇంధనం, విద్య తదితర రంగాల సహకారాన్ని ఇరు దేశాల నేతలు సమీక్షించనున్నారు. తాష్కెంట్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారకార్థం ఏర్పాటు చేసిన కేంద్రాన్ని, తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లోని మహాత్మా గాంధీ కేంద్రాన్ని కూడా ప్రధాని సందర్శించనున్నారు.

ఇది కూడా చదవండి: మ్యూజియంలో భారీ చోరీ.. 200 క్యారెట్ల వజ్రాల హారం మాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement