రాజౌరీ: జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లా నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంట పాకిస్థాన్కు చెందిన డ్రోన్ల కదలికలను భారత సైన్యం విజయవంతంగా అడ్డుకుంది. నౌషేరా సెక్టార్లోని రుమ్లీధార ప్రాంతంలో భారత వాయుసీమలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మూడు డ్రోన్లను భద్రతా దళాలు వెనక్కి తరిమికొట్టాయి. అనంతరం ఆ ప్రాంతంలో సైన్యం విస్తృత గాలింపు చర్యలు చేపట్టింది. సైనిక వర్గాల సమాచారం ప్రకారం.. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం వేళల్లో అనుమానాస్పద డ్రోన్లు సరిహద్దు దాటేందుకు యత్నించాయి.
రుమ్లీధార వద్ద వీటిని గుర్తించిన 22వ జమ్మూ అండ్ కశ్మీర్ రైఫిల్స్ బలగాలు తక్షణమే అప్రమత్తమయ్యాయి. వెంటనే కౌంటర్-డ్రోన్ వ్యవస్థలను క్రియాశీలం చేయడంతో, ఆ మూడు డ్రోన్లు సరిహద్దు దాటి తిరిగి పాకిస్థాన్ వైపు వెళ్లిపోయాయి. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. భారత దళాల కదలికలను పసిగట్టేందుకు, ఉగ్రవాదుల చొరబాట్లకు సహకరించేందుకు పాక్ దళాలు డ్రోన్లను ఉపయోగిస్తున్నాయని, అయితే ఇలాంటి ప్రయత్నాలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోందని అధికారులు తెలిపారు.
ఇటీవల కథువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్ పరిధిలోని బోబియాన్ ప్రాంతంలో కూడా ఒక డ్రోన్ చక్కర్లు కొట్టి వెనక్కి వెళ్లింది. ఆయుధాలు లేదా మాదకద్రవ్యాలను జారవిడిచారా అనే అనుమానంతో అప్పట్లో గాలింపు జరపగా ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. మరోవైపు సరిహద్దుల్లో సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉందని నార్తర్న్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ స్పష్టం చేశారు. గురువారం ఆయన దక్షిణ కశ్మీర్లో పర్యటించి భద్రతా ఏర్పాట్లను, కార్యాచరణ సంసిద్ధతను సమీక్షించారు. సైనికుల నిబద్ధతను, మనోధైర్యాన్ని ప్రశంసిస్తూ, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: నేటి నుంచి ప్రధాని మోదీ ఉజ్బెకిస్థాన్, కిర్గిజిస్థాన్ పర్యటన


