రాఖీ పండుగకు సంబంధించిన పౌరాణిక గాథల్లో ఐక్యత కోసం, శత్రుత్వాన్ని మాపి రక్షగా మార్చుకునేందుకు ఈ పండుగను ఉపయోగిస్తే..ఇంకాస్త ముందడుగు వేసి పరిసరాలకు రక్షగా మార్చి పర్యావరణంపై ప్రేమను చాటుకుంటున్నారు అక్కడ స్టూడెంట్స్. వృక్షో రక్షతి రక్షితః అన్న మాటను సార్థకం చేసేలా పర్యావరణ పరిరక్షణ బాధ్యతను గుర్తుచేసేలా రక్షాబంధన్ వేడుకను కాస్తా ‘వృక్షాబంధన్గా’ జరుపుకుంటున్నారు హర్యానా, మఖండ్ గ్రామంలోని ఉన్నత పాఠశాల విద్యార్థినులు.
అక్కడ రాఖీ పూర్ణిమను పురస్కరించుకుని “ఏక్ రాఖీ పేడ్ కే నామ్” అనే ప్రచారం పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. అదే చెట్టుకు రాఖీ. అక్కడ మొత్తం 101 మంది విద్యార్థులు చెట్లకు రాఖీ కట్టి వాటి సంరక్షణను తామే చూసుకుంటామని ప్రతిజ్ఞ చేయడం విశేషం. ఈ పండుగలోని ‘రక్షణ’ సందేశాన్ని తెలియజేసేలా పర్యావరణ పరరక్షణకు అనుసంధానించి ఇలా వినూత్నంగా పండుగను జరుపుకున్నారు అక్కడ విద్యార్థినులు.
ఇందుకు ఉపాధ్యాయులు, అక్కడ అధికారులు విద్యార్థినులను చైతన్యపర్చేలా ప్రోత్సహిస్తూ..ఆ కార్యక్రమంలో భాగమయ్యేలా చేశారు. ఇలాంటి కార్యక్రమాలే దేశవ్యాప్తంగా మరికొన్ని ఉన్నాయి అవేంటే ఈ సందర్భంగా చూద్దామా..!.
ఇలాంటి "వృక్ష బంధన్" కార్యక్రమాలు కేవలం హర్యానాలోనే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా చేపట్టారు. వాటిలో కొన్ని..
జార్ఖండ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం దాదాపు ఒక లక్షకు పైగా చెట్లకు రాఖీలు కట్టే భారీ ప్రచారాన్ని నిర్వహించారు
మహారాష్ట్రలోని థానే పాఠశాల విద్యార్థులు పర్యావరణ అనుకూల రాఖీలను స్వయంగా తయారు చేసి చెట్లకు కట్టారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో అక్కడ విద్యార్థులు దాదాపు 150 ఏళ్ల నాటి చారిత్రాత్మక మర్రిచెట్టుకు విత్తన రాఖీలు (Seed Rakhis) కట్టి తమ ప్రేమను చాటుకున్నారు.
(చదవండి: చెఫ్ వికాస్ ఖన్నాకు రాఖీ కట్టిన రాధికా మర్చంట్)


