వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ (ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ రఫెల్ మారియానో గ్రాస్సీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య జరగనున్న సమావేశానికి పూర్తి మద్దతు ప్రకటించారు. మానవ హక్కుల ఉల్లంఘనలు, నియంతృత్వ నేపథ్యం ఉన్నప్పటికీ చర్చలను ఆపకూడదని, ఇరువురు నేతలు భేటీ కావడం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
కిమ్తో సమావేశం ఏర్పాటు చేయడాన్ని ట్రంప్ వ్యతిరేకులు విమర్శిస్తున్నప్పటికీ, ఈ ఏడాది చివర్లో కిమ్ను కలవనున్నట్లు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఉత్తర కొరియా వద్ద 57 శక్తివంతమైన అణు ఆయుధాలు ఉన్నాయని, కిమ్తో సత్సంబంధాలు ఉండటం మంచి పరిణామమేనని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను గ్రాస్సీ ఉదాహరణగా ప్రస్తావిస్తూ, దౌత్యమంటేనే కరచాలనం చేసి గౌరవప్రదమైన చర్చల ద్వారా ఫలితాలు సాధించడమని ‘ది వాషింగ్టన్ పోస్ట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ప్రస్తుత ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పదవీకాలం 2026 డిసెంబర్ 31తో ముగియనుండటంతో, తదుపరి సెక్రటరీ జనరల్ పదవికి గ్రాస్సీ ముందంజలో ఉన్నారు.
అర్జెంటీనాకు చెందిన 65 ఏళ్ల గ్రాస్సీని ఆ దేశం 2025 నవంబర్ 26న నామినేట్ చేసింది. గత ఆరేళ్లుగా ఐఏఈఏ అధిపతిగా ఉన్న ఆయన, ఇరాన్ అణు ఒప్పంద చర్చల్లో కీలక పాత్ర పోషించడమే కాక, ఉక్రెయిన్లోని జపోరిజియా అణు విద్యుత్ కేంద్రంలో బృందాన్ని మోహరించడంలో విజయం సాధించారు. భద్రతా మండలి శాశ్వత సభ్యుల మద్దతు అవసరమైన ఈ రేసులో ఇప్పటివరకు ఎనిమిది మంది అభ్యర్థులు ఉండగా, రష్యా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, వాస్తవ శాంతి-భద్రత అంశాలను సమర్థంగా పరిష్కరిస్తున్న ఏకైక అభ్యర్థిని తానేనని గ్రాస్సీ ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: సరస్సు పేరునూ మార్చేసిన ట్రంప్.. భగ్గుమన్న కెనడా!


