కెనడా నుంచి పెట్టుబడులపై భారత్ ఫోకస్
ఆర్థిక సంస్థలతో మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ
కెనడా ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించే దిశగా పలు కెనడియన్ ఆర్థిక సంస్థలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. భారత్లో పెట్టుబడులను మరింతగా పెంచాలని కోరారు. మంత్రితో సమావేశమైన సంస్థల్లో సన్ లైఫ్ ఫైనాన్షియల్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు (సీపీపీఐబీ) మొదలైనవి ఉన్నాయి. ఈ సందర్భంగా భారత్లో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచడం, 2047 నాటికి అందరికీ బీమా కల్పించాలంటూ భారత్ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం తదితర అంశాలను వివరించారు.
భారత్ పటిష్ట వృద్ధి, విస్తృత మార్కెట్, స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉండటం, డిజిటల్..ఫిజికల్ మౌలిక సదుపాయాలు వేగంగా వృద్ధి చెందుతుండటం మొదలైనవి దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు కల్పించడంపై చర్చించినట్లు సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్లో ఆర్థిక శాఖ పోస్ట్ చేసింది. బీమా, అసెట్ మేనేజ్మెంట్, మౌలిక సదుపాయాలు మొదలైన విభాగాల్లో కార్యకలాపాలను విస్తరించేందుకు సన్ లైఫ్కి మరింతగా అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయలేదా?


