నేపాల్లో భారీ వరదల నేపథ్యంలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన వెలుగుచూసింది. వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఓ మహిళ మృతదేహాన్ని జుట్టు పట్టుకుని బయటకు లాగిన ఇద్దరు వ్యక్తులు.. ఆమె చెవులకు ఉన్న బంగారు పోగులను చోరీ చేశారు. దీనికి సంబంధించిన 41 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నరాయణి నదిలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహాన్ని 25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేశ్ చౌదరి గుర్తించారు. చెక్క దుంగల సాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు లాగిన వారు.. జుట్టు పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమె రెండు చెవులకు ఉన్న పోగులను తొలగించి పక్కన పెట్టుకున్నారు. చుట్టూ ఉన్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీశారు.
ఈ వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన చిత్వాన్ పోలీసులు నిందితులను గుర్తించారు. గురువారం భరత్పూర్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిలోని పోఖరా బస్పార్క్ సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల పట్ల దోపిడీకి పాల్పడటం, అమానవీయంగా వ్యవహరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు.
మరోవైపు నేపాల్–టిబెట్ సరిహద్దులో వరదలు, కొండచరియలు బీభత్సం తీవ్ర విషాదం మిగిల్చాయి . ఈ విపత్తులో ఇప్పటివరకు కనీసం 500 మంది మృతి చెందగా.. 1,400 మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. భారీ బురద, కొండచరియల కారణంగా పలు గ్రామాలు, రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెస్క్యూ బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి.
ఇదీ చదవండి: ట్రంప్-కిమ్ భేటీ ఇప్పుడు ఎంతో అవసరం!


