న్యూఢిల్లీ: జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘ఖేలో ఇండియా డైలాగ్’ను ఉద్దేశించి ప్రసంగించారు. యువత దేశానికి వెన్నెముక అని పేర్కొన్నారు. దీనిలో ‘మేరా యువ భారత్’ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలోని రెండు కళాశాలల నుంచి యువత భాగస్వాములయ్యారు. క్రీడలను కేవలం ప్రతిభను వెలికితీయడానికే కాకుండా, యువజన నాయకత్వం, పౌర బాధ్యత, దేశ నిర్మాణంలో కీలక సాధనంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య లక్ష్యంతో పాటు ‘వికసిత్ భారత్’ దిశగా యువతను నడిపించేందుకు ఈ వేదిక దోహదపడనుంది. ఈ కార్యక్రమంలో ‘యువ సంవాద్’ పేరుతో అత్యాధునిక వసతులు, కోచింగ్, స్పోర్ట్స్ సైన్స్ ద్వారా దేశీయ క్రీడా రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు.


