పెరుగుతున్న విద్యుత్ బిల్లులకు ప్రత్యామ్నాయంగా ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవాలని చాలామంది భావిస్తుంటారు. అయితే భారీగా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి రావడం అడ్డంకిగా మారుతోంది. ఈ నేపథ్యంలో టాటా పవర్ బీహార్లో ‘ఘర్ ఘర్ సోలార్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న గృహ వినియోగదారులు కేవలం రూ.999 ప్రారంభ చెల్లింపుతో రూఫ్టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
టాటా పవర్ సోలార్ రూఫ్ (Solaroof) ద్వారా అందిస్తున్న ఈ ప్రత్యేక ఫైనాన్సింగ్ సదుపాయంలో సిస్టమ్ ఖర్చుకు 100 శాతం వరకు రుణ సౌకర్యం అందుబాటులో ఉండొచ్చు. రుణ కాలపరిమితి గరిష్ఠంగా 60 నెలల వరకు ఉంటుంది. అయితే వడ్డీ రేటు, అర్హత, ఈఎంఐ వంటి అంశాలు వినియోగదారుడి ప్రొఫైల్, సిస్టమ్ సామర్థ్యం, ఫైనాన్సింగ్ భాగస్వామిని బట్టి మారవచ్చు. టాటా పవర్ ప్రస్తుతం సోలార్ ఫైనాన్సింగ్ కోసం బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో కలిసి పనిచేస్తోంది.
5 ఏళ్ల వరకు ఈఎంఐ
బీహార్లో ప్రకటించిన ఈ ఆఫర్లో రూ.999ను ప్రారంభ చెల్లింపుగా చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈఎంఐల రూపంలో చెల్లించే అవకాశం ఉంది. కొన్ని సోలార్ సిస్టమ్లపై 60 నెలల వరకు కాలపరిమితి ఉండొచ్చు. ఫైనాన్సింగ్ నిబంధనలు, వడ్డీ, సబ్సిడీ, సిస్టమ్ ధర ఆధారంగా వాస్తవ ఈఎంఐ మారుతుంది.
టాటా పవర్ తాజా బీహార్ కార్యక్రమం ద్వారా రాబోయే మూడేళ్లలో 5 లక్షల ఇళ్లకు రూఫ్టాప్ సోలార్ చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీహార్లో ఇప్పటివరకు సుమారు 25 వేల రూఫ్టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లు జరిగిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని కంపెనీ భావిస్తోంది. ఇందుకోసం 18 బ్యాంకులతో భాగస్వామ్యం చేసుకున్నట్లు, సుమారు 100 మంది భాగస్వాములు, రిటైలర్లతో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించింది.
కేంద్ర, రాష్ట్ర సబ్సిడీతో మరింత ప్రయోజనం
రూఫ్టాప్ సోలార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన కింద సబ్సిడీ అందిస్తోంది. ప్రస్తుతం 1 కిలోవాట్ సోలార్ సిస్టమ్కు రూ.30,000, 2 కిలోవాట్లకు రూ.60,000, 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్ఠంగా రూ.78,000 వరకు కేంద్ర సబ్సిడీ లభిస్తుంది.
బీహార్ ప్రభుత్వం కూడా అదనపు సాయం ప్రకటించినట్లు టాటా పవర్ తెలిపింది. రాష్ట్ర సబ్సిడీ 1 కిలోవాట్కు రూ.10,000, 2 కిలోవాట్లకు రూ.20,000గా ఉండగా, కేంద్ర-రాష్ట్ర సబ్సిడీలతో కలిపి 1 కిలోవాట్కు రూ.40,000, 2 కిలోవాట్లకు రూ.80,000, 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువకు రూ.98,000 వరకు మొత్తం ప్రయోజనం లభించవచ్చని కంపెనీ వెల్లడించింది.
ఇదీ చదవండి: పోస్టల్ శాఖ గుడ్ న్యూస్.. ఇక మరింత మందికి ఆ బెనిఫిట్


