తండ్రి లేదా తాతలు, ముత్తాతల నుంచి సంక్రమించిన ఆస్తికి సంబంధించి ఒరిజినల్ సేల్ డీడ్ (క్రయపత్రం) లేకపోవడం, చట్టబద్ధమైన విల్లు రాయకుండానే వారు మరణించడం భారతీయ కుటుంబాల్లో తరచూ ఎదురయ్యే ప్రధాన సమస్య. ఇటువంటి సందర్భాల్లో చట్టబద్ధమైన యాజమాన్య హక్కులను ఎలా నిరూపించుకోవాలి? ఆ ఆస్తిపై వచ్చే అద్దె ఆదాయానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటించాలనే దానిపై న్యాయ, పన్ను నిపుణులు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నారు.
యాజమాన్య హక్కుల నిర్ధారణ
ఒరిజినల్ సేల్ డీడ్ పోయినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు (ఎఫ్ఐఆర్) చేసి నాన్-ట్రేసబుల్ సర్టిఫికేట్ పొందాలి. అనంతరం రెండు పత్రికల్లో (ఒక ఇంగ్లీష్, ఒక ప్రాంతీయ భాష) బహిరంగ ప్రకటన ఇవ్వాలి.
సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి లింక్ డాక్యుమెంట్లు, ‘సర్టిఫైడ్ కాపీ’ పొందాలి. ఇది ఒరిజినల్ పత్రంతో సమానమైన న్యాయపరమైన గుర్తింపు కలిగి ఉంటుంది.
విల్లు లేనందున వారసులందరూ తమ హక్కులను నిరూపించుకోవడానికి తహసీల్దార్ ద్వారా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లేదా సివిల్ కోర్టు నుంచి సక్సెషన్ సర్టిఫికేట్ పొందడం తప్పనిసరి.
రెవెన్యూ/మున్సిపల్ రికార్డుల్లో పేరు మార్పిడి (మ్యుటేషన్) చేయించాలి. వారసుల్లో ఎవరైనా తమ వాటాను వదులుకోవాలనుకుంటే ‘రిలీజ్ డీడ్’ రిజిస్టర్ చేయాలి.
అద్దె ఆదాయంపై పన్ను బాధ్యతలు
ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం, వారసత్వంగా ఆస్తి సంక్రమించినంత మాత్రాన తక్షణమే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే.. విల్లు లేనప్పుడు వారసులందరూ సమాన వాటాదారులుగా పరిగణించబడతారు. ఆస్తిపై వచ్చే అద్దె ఆదాయాన్ని తమ తమ వాటాల ప్రకారం విభజించి వారి వ్యక్తిగత పన్ను స్లాబ్ల ఆధారంగా ఆదాయపు పన్ను రిటర్నులో చూపించాలి. అద్దె ఆదాయంపై చట్టంలోని సెక్షన్ 24(a) కింద 30 శాతం స్టాండర్డ్ డిడక్షన్ (మరమ్మతులు, నిర్వహణ నిమిత్తం), చెల్లించిన మున్సిపల్ పన్నుల మినహాయింపు లభిస్తుంది. ముందస్తుగా ఈ చట్టపరమైన పత్రాలను క్రమబద్ధీకరించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆస్తి విక్రయాలు, బ్యాంక్ రుణాలు లేదా కుటుంబ వివాదాలు రాకుండా అరికట్టవచ్చని చట్ట నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: ట్రంప్ ఆరోగ్యంపై నిజనిజాలు!


