దేశ ప్రజల దైనందిన జీవితంలో బ్యాంకులు భాగమైపోయాయి. ఏదో ఒక పని నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం చాలా మందికి వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల పనిదినాలు, సెలవుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వారం ఆగస్టు 24 నుంచి 30 వరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హాలిడే క్యాలెండర్ ప్రకారం ఈ వారంలో ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి. సాధారణ పనిదినాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.
ఈ వారం బ్యాంకు సెలవులు
ఆగస్టు 25, మంగళవారం: మిలాద్-ఉన్-నబీ, మిలాద్-ఇ-షెరీఫ్ సందర్భంగా కేరళ, ఆంధ్రప్రదేశ్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. కేరళలో తొలి ఓణం వేడుకల కారణంగానూ బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి.
ఆగస్టు 26, బుధవారం: ఈద్-ఎ-మిలాద్, బరావాఫత్, మిలాద్-ఉన్-నబీ, తిరుఓణం వేడుకల కారణంగా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, తెలంగాణ, మణిపూర్, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్, కేరళ, ఢిల్లీ, బిహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఆగస్టు 28, శుక్రవారం: రక్షా బంధన్ సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్, కేరళ, హిమాచల్ప్రదేశ్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఆగస్టు 30, ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ వారాంతపు సెలవు ఉంటుంది. కాగా, ఆగస్టు 29 శనివారం కావడంతో ఆ రోజు బ్యాంకులు సాధారణంగా తెరిచి ఉంటాయి.
అందుబాటులో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు
బ్యాంకు సెలవు రోజుల్లో భౌతిక శాఖల్లో సేవలు అందుబాటులో ఉండవు. అయితే డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగదారులు యథావిధిగా పొందవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం వంటి సేవలు సాధారణంగా 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. అలాగే ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ వంటి ఆన్లైన్ లావాదేవీ సేవలను కూడా వినియోగించుకోవచ్చు.
ఇదీ చదవండి: బాండ్లు అమ్మేయండి.. బంగారం కొనేయండి: బిలియనీర్ ఇన్వెస్టర్ హెచ్చరిక.. సూచన


