అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల ర్యాలీ కొనసాగుతోంది. అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్ల బైబ్యాక్ను అనూహ్యంగా పెంచడం, డాలర్ బలహీనపడటం, బాండ్ ఈల్డ్స్ తగ్గడం వంటి పరిణామాలు పసిడి ధరలకు మద్దతుగా నిలిచాయి. దీంతో వరుసగా మూడో వారంలోనూ బంగారం లాభాలతో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం స్పాట్ గోల్డ్ ఔన్స్కు 0.4 శాతం పెరిగి సుమారు 4,537 డాలర్ల వద్ద ట్రేడైంది. వారానికి దాదాపు 3.6 శాతం లాభపడింది.
బైబ్యాక్ పెంపుతో మార్కెట్లలో కలకలం
అమెరికా ట్రెజరీ ఆగస్టు 19న 10 నుంచి 30 ఏళ్ల కాలపరిమితి ఉన్న ప్రభుత్వ బాండ్ల బైబ్యాక్ కార్యకలాపాల పరిమాణాన్ని ఒక్కో ఆపరేషన్కు 2 బిలియన్ డాలర్ల నుంచి కనీసం 4 బిలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక బాండ్ మార్కెట్లో లిక్విడిటీని మెరుగుపరచడం, ఇటీవల పెరిగిన ఈల్డ్స్ను అదుపులోకి తీసుకురావడం ఈ చర్య లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రకటన అనంతరం అమెరికా బాండ్ ఈల్డ్స్ గణనీయంగా తగ్గడంతోపాటు డాలర్ కూడా బలహీనపడింది. ఈ రెండు పరిణామాలు డాలర్లలో ధర నిర్ణయించే బంగారానికి అనుకూలంగా మారాయి.
ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ మాత్రం ఈ స్థాయితో ఆగబోమన్న సంకేతాలు ఇచ్చారు. అవసరమైతే బాండ్ బైబ్యాక్లను మరింత పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో అమెరికా ప్రభుత్వ రుణం 40 ట్రిలియన్ డాలర్లను దాటడం, వడ్డీ చెల్లింపులు భారీగా పెరుగుతుండటం పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచుతున్నాయి.
చమురు ధరలూ కీలకమే..
మరోవైపు ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరగడం బంగారం ర్యాలీకి మరో ముఖ్యమైన అంశంగా మారింది. ఇంధన ధరలు ఎక్కువకాలం అధికంగా ఉంటే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగవచ్చు. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడంలో వెనుకడుగు వేసే అవకాశం ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. సాధారణంగా అధిక వడ్డీ రేట్లు బంగారానికి ప్రతికూలం. అయితే ప్రస్తుతం బలహీనమైన డాలర్, భౌగోళిక-రాజకీయ అనిశ్చితి, అమెరికా ప్రభుత్వ రుణభారం వంటి అంశాలు ఆ ప్రభావాన్ని కొంతమేర అధిగమిస్తున్నాయి.
ఈ నెలలో 11 శాతానికి పైగా..
ఆగస్టులో ఇప్పటివరకు అంతర్జాతీయ బంగారం ధర దాదాపు 11 శాతానికి పైగా పెరిగింది. ఆగస్టు 19న ఒక్కరోజే స్పాట్ గోల్డ్ 3 శాతానికి పైగా దూసుకెళ్లి 4,500 డాలర్ల స్థాయికి చేరువైంది. ఆ సమయంలో అమెరికా ట్రెజరీ చర్యతో ఈల్డ్స్, డాలర్ రెండూ తగ్గడం ప్రధాన కారణంగా నిలిచింది.
అయితే బంగారం జనవరిలో నమోదైన రికార్డు గరిష్ఠ స్థాయి 5,318.40 డాలర్లతో పోలిస్తే ఇంకా సుమారు 15 శాతం దిగువనే ఉంది. దీంతో ప్రస్తుత ర్యాలీ బలమైనదే అయినప్పటికీ, రికార్డు స్థాయిని తిరిగి అందుకోవడానికి మరింత ఊతం అవసరమని మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు.
దేశీయంగానూ ధరలకు జోష్
అంతర్జాతీయ ప్రభావం దేశీయ మార్కెట్పైనా స్పష్టంగా కనిపిస్తోంది. ఆగస్టు 21న ఎంసీఎక్స్లో బంగారం ఫ్యూచర్స్ 0.36 శాతం పెరిగి 10 గ్రాములకు సుమారు రూ.1.60 లక్షల వద్ద కదిలాయి. దేశీయ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1,59,280గా నమోదైంది. వెండి ధర కూడా కిలోకు రూ.2.45 లక్షల స్థాయిని దాటింది.
ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్


