ఒక్కరోజు గడిస్తే దేశం దాటేవాడు.. ఫోన్‌, కార్డులు లేకుండా నాలుగు రాష్ట్రాల్లో.. | AE Nukaraju Case Sadhik khan No Phone Journey Here the Story | Sakshi
Sakshi News home page

ఒక్కరోజు గడిస్తే దేశం దాటేవాడు.. ఫోన్‌, కార్డులు లేకుండా నాలుగు రాష్ట్రాల్లో..

Aug 23 2026 7:19 AM | Updated on Aug 23 2026 7:40 AM

AE Nukaraju Case Sadhik khan No Phone Journey Here the Story

సాక్షి, కాకినాడ: నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన అనంతరం పరారీలో ఉన్న సాధిక్ ఖాన్‌ను పోలీసులు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సాధిక్ పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. తన ఆచూకీ బయటపడకుండా సెల్‌ఫోన్, డెబిట్, క్రెడిట్ కార్డులు వెంట తీసుకెళ్లకుండా.. రైలు ప్రయాణంలో ఇతరుల ఫోన్లు ఉపయోగిస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

ఆత్మహత్య తర్వాత పరారీ
నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన తర్వాత సాధిక్ ఖాన్ సామర్లకోట నుంచి పరారయ్యాడు. అక్కడి నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి కర్ణాటకలోని వాడి రైల్వే స్టేషన్‌లో దిగినట్లు పోలీసులు గుర్తించారు. వాడి నుంచి తదుపరి తన ప్రయాణాన్ని కొనసాగించిన సాధిక్.. మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చేరుకున్నాడు. అక్కడ తన స్నేహితుడిని కలిసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. అనంతరం, సోలాపూర్‌లో కొంతసేపు మకాం వేసిన అనంతరం సాధిక్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అక్కడి నుంచి ఢిల్లీకి, ఆపై ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సాధిక్ వరుసగా ప్రాంతాలు మార్చుకుంటూ ప్రయాణించడంతో అతడి ఆచూకీ గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది.

విదేశాలకు వెళ్లేందుకు స్కెచ్..
మీరట్ చేరుకున్న తర్వాత కూడా సాధిక్ అక్కడే ఉండిపోవాలని భావించలేదని పోలీసులు గుర్తించారు. కేరళలోని మలబార్ తీరానికి చేరుకుని, అక్కడి నుంచి సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోవాలని ప్రణాళిక వేసుకున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఒక్కరోజు ఆలస్యమైనా దేశం దాటి వెళ్లేందుకు ప్రయత్నించేలా తన ప్రయాణాన్ని సాధిక్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేరళ తీరానికి చేరుకుని అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా విదేశాలకు వెళ్లిపోతే పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవచ్చని భావించినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్యే థామన్‌ ఆసుపత్రితో యువతి ఆత్మహత్య

ఇక, పోలీసులకు తన కదలికలపై ఎలాంటి ఆధారం దొరకకుండా ఉండేందుకు సాధిక్ మరింత జాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. తన వెంట సెల్‌ఫోన్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులను తీసుకెళ్లలేదు. సాధారణంగా సెల్‌ఫోన్ ద్వారా వ్యక్తి ప్రయాణించే ప్రాంతాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. అలాగే, బ్యాంకు కార్డుల వినియోగం ద్వారా కూడా అతడి కదలికలను పోలీసులు గుర్తించే అవకాశం ఉంది. దీంతో ఈ రెండింటినీ తన వెంట తీసుకెళ్లకుండా సాధిక్ ప్రయాణించినట్లు తెలిసింది. అయితే, ఇదే జాగ్రత్త చివరకు అతడికి చిక్కేలా చేసిన కీలక క్లూగా మారింది. రైలు ప్రయాణ సమయంలో సాధిక్ తోటి ప్రయాణికుల నుంచి సెల్‌ఫోన్ తీసుకుని తన సోదరి, ఓ లాయర్‌తో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. తన సొంత ఫోన్ ఉపయోగించకపోయినా.. ఇతరుల ఫోన్ల నుంచి చేసిన కాల్స్ అతడి ఆచూకీని గుర్తించేందుకు పోలీసులకు కీలక ఆధారంగా మారినట్లు తెలుస్తోంది. ఆ కాల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు సాధిక్ కదలికలపై నిఘా పెట్టారు. చివరకు అతడు మీరట్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు.

మీరట్ కోర్టులో హాజరు..
మీరట్‌లో సాధిక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్ పొందిన పోలీసులు అతడిని కాకినాడకు తీసుకువస్తున్నారు. కాకినాడకు తీసుకువచ్చిన తర్వాత సాధిక్‌ను విచారించడంతో కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సాధిక్‌ను కాకినాడకు తీసుకువచ్చిన అనంతరం అతడి ప్రయాణ మార్గం, ఎవరెవరిని కలిశాడు, కేరళలో ఎవరిని సంప్రదించాలనుకున్నాడు, సముద్ర మార్గంలో విదేశాలకు వెళ్లేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నాడు అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement