ఇది ప్రజలే చెబుతున్నారు
ప్రజల ఆస్తులు లాక్కుంటున్న నీకు పాలాభిషేకం చేయమంటావా?
నారా లోకేశ్పై నిప్పులు చెరిగిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు
నవులూరు రైతుల భూమిని బలవంతంగా లాక్కోవడంపై మండిపాటు
ఎవరి శవాల మీద రాజ్యం ఏలదామనుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం
సాక్షి, అమరావతి: నవులూరు రైతుల ఆస్తిని దొబ్బేసి, వాళ్లు దాని కోసం కాళ్లరిగేలా తిరుగుతుంటే పట్టించుకోకుండా పాలాభిషేకం చేయమంటారా అని సీఎం కుమారుడు, మంత్రి లోకేశ్పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నవులూరు రైతుల సమస్యను స్వయంగా తెలుసుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో ప్రజల ఆస్తులను లాక్కుంటున్న మీకు పాలాభిషేకం కావాలా అని ప్రశ్నించారు. మీ పాలనకంటే వైఎస్ జగన్ పాలన వంద రెట్లు బాగుందని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. నవులూరు గ్రామంలోని సర్వే నంబర్ 774లో ఉన్న 30 ఎకరాల భూమికి వందేళ్లకుపైగా చరిత్ర ఉందని తెలిపారు.
1907లో బ్రిటిష్ వాళ్లు రాసిన ఆర్ఎస్ఆర్లో ఈ భూమిని చెరువుగా పేర్కొన్నారని, 1913లో అదే భూమిని ఆరు సర్వే నంబర్లుగా విభజించి వ్యవసాయానికి అనుగుణమైన భూమిగా గుర్తించారని తెలిపారు. 1923–25 ప్రాంతంలో ఎకరన్నర, రెండు ఎకరాల చొప్పున పలువురు వ్యక్తులకు ఆ భూములను అసైన్ చేశారని చెప్పారు. ఆ తర్వాత వందేళ్లలో భూములు పలువురి చేతులు మారాయన్నారు. 2024లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు కలెక్టర్ ఈ 30 ఎకరాల భూమిని సీఆర్డీఏకు అప్పగించేశారని తెలిపారు. బాధితులు కలెక్టర్కు అర్జీలు పెట్టగా తాము ఆ భూమిని సీఆర్డీఏకు దానం చేసేశామని, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పారని వివరించారు.
పీజీఆర్ఎస్లో అర్జీ పెట్టుకుంటే సీఆర్డీఏ నుంచి సమాధానం రావాల్సి ఉందని చెప్పి వాళ్లు మాత్రం అర్జీ పరిష్కారమైందని రాసేసుకున్నారని విమర్శించారు. కోర్టు వ్యాజ్యంలో ఉన్న భూమిని రాజధాని కోసం లాగేసుకుంటారా అని మండిపడ్డారు. అమరావతిని నిర్మించడానికి రైతుల పొట్ట కొడతారా, ఆస్తి హక్కు ఉన్నవారికి పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు. 200 గజాల స్థలం కోసం బాధితుడు మళ్లీ హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇదీ లోకేశ్ నియోజకవర్గంలో జరుగుతున్న తంతు అని అన్నారు. ఎవరి శవాల మీద మీరు రాజ్యం ఏలుదామని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఆస్తుల మీద మీరు రాజ్యం ఏలదామని అనుకుంటున్నారని మండిపడ్డారు.


