ఈ రోజుల్లో ఏదైనా పోతే మళ్లీ మన చెంతకే చేరుతుందనేది చెప్పడం కష్టం. అది మనిషైనా.. పెంపుడు జంతువైనా.. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ మనకు దూరమైనవి తిరిగి చెంతకు చేరితే ఆ ఆనందం మాటలకందనిది. అలాంటి భావోద్వేగ స్థితిని అనుభవిస్తున్నాడు ఈ వ్యక్తి.
ఇంగ్లాండ్లోని వెస్ట్ యార్క్షైర్కు చెందిన రాబర్ట్ మోర్టిమర్ అనే వ్యక్తి, పెంపుడు చిలుక అపహరణకు గురైంది. దాదాపు పదేళ్ల తర్వాత అదే చిలుక అతడి చెంతకు చేరింది. నిజానికి అతడు అది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుందని అనుకున్నాడు. యాదృచ్ఛికంగా దాని ఆచూకి తెలియడం, తన చెంతకు చేరడం ఆ వ్యక్తిని ఆనందంలో ముంచెత్తింది. అదెలా అపహరణకు గురైందంటే..
2017లో బ్రాడ్ఫోర్డ్ నగరంలోని తన ఇంటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నా బార్నీ అనే పెంపుడు చిలుక కనిపించకుండా పోయింది. యజమాని రాబర్ట్ దాన్ని ఎవరో ఎత్తుకుపోయారని చాలా బాధపడ్డాడు. ఆ సమయంలో తన పక్షి ఆచూకీ కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఏళ్లు గడిచే కొద్దీ ఆ పెంపుడు పక్షి మళ్లీ కనిపించే అవకాశాలే అస్సలు కనిపించలేదు.
కానీ ఇటీవల ఆ చిలుక యజమాని 56 ఏళ్ల రాబర్ట్కు స్థానిక పోలీసు అధికారి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. బార్నీ అనే చిలుక సజీవంగా దొరికిందని, ఫోన్ చేసి చెప్పారు. అది నిజమా కల అని ఒక్కసారిగా విస్తుపోయాడు రాబర్ట్. అంతేగాదు ఆ చిలుక ఎక్కడైతే దొంగలింపబడిందో..అక్కడికి సుమారు 20 మైళ్ల దూరంలో ఐక్య(IKEA) పార్కింగ్ స్థలంలో దొరికింది. జంతు సంరక్షణ కార్యకర్త బార్నీకి అటాచ్ చేసి ఉన్న మైక్రోచిప్ని స్కాన్ చేయగా..దానికి అనుసంధానించి ఉన్న ఫోన్ నెంబర్ పనిచేయకపోవడంతో యజమానిని గుర్తించలేకపోయినట్లు పోలీసులు చెప్పారు.
అయితే చాలామంది అది మా చిలుక అంటూ వచ్చారు గానీ..వాళ్లెవరూ తమ వద్ద సరైన ఆధారాలను చూపించలేకపోయారు అని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆ పక్షికి ఉన్న చిప్ ద్వారా దాని పేరు బార్నీ అని తెలిసింది. తాము మొదటిసారి దానిపేరుతో పిలవగానే నా పేరు వీళ్లకి ఎలా తెలుసు అన్నట్లుగా ఆశ్చర్యపోయిందన్నారు. ఆ తర్వాత తాము ఇంటర్నెట్లో దాని కోసం వెతకగా..తిరిగి దాని యజమాని చెంతకు చేర్చగలిగామని చెప్పారు.
(చదవండి: వీల్చైర్లో మహిళ పుల్ అప్స్..! వీడియో వైరల్)


