కుక్క కాటు.. కోర్టులో ట్విస్ట్‌! నాలుగేళ్ల తర్వాత కీలక తీర్పు! | Xl Bully Dog Attack Woman Cleared By Court | Sakshi
Sakshi News home page

కుక్క కాటు.. కోర్టులో ట్విస్ట్‌! నాలుగేళ్ల తర్వాత కీలక తీర్పు!

Aug 24 2026 1:42 PM | Updated on Aug 24 2026 1:52 PM

Xl Bully Dog Attack Woman Cleared By Court

వ్రెక్సామ్‌: ఓ వ్యక్తిని కరిచి, తీవ్ర రక్తస్రావంతో అతడి మరణానికి కారణమైన ఎక్స్‌ఎల్‌ బుల్లీ కుక్కకు యజమాని తానేనని, తన నిర్లక్ష్యం వల్లే అతడి మృతికి కారణమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఓ మహిళకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఈ కేసులో 33 ఏళ్ల చానెల్‌ ఫాంగ్‌ను కెర్నార్ఫన్‌ క్రౌన్‌ కోర్టు జ్యూరీ నిర్దోషిగా ప్రకటించింది.

ఈ ఘటన 2022 మే 23న వేల్స్‌లోని వ్రెక్సామ్‌లో జరిగింది. చానెల్‌ ఫాంగ్‌ ఇంట్లో ఉన్న ‘కుకీ’ అనే ఎక్స్‌ఎల్‌ బుల్లీ కుక్క ఆమె భర్త తండ్రి కెవెన్‌ జోన్స్‌ (62)పై దాడి చేసింది. ఉదయం సుమారు 11:30 గంటలకు కెవెన్‌ తోటలో ఉన్న కుకీని, మరో కుక్కను ఇంట్లోకి తీసుకురావడానికి వెళ్లారు. కొద్దిసేపటికే కుకీని ఉద్దేశించి ‘వదిలేయ్‌’ అంటూ ఆయన అరవడం వినిపించింది. ఆ తర్వాత తడబడుతూ ఫాంగ్‌ వద్దకు వచ్చిన కెవెన్‌ తన కాలిని చూపించారు. అక్కడి నుంచి తీవ్రంగా రక్తం వస్తుండటంతో.. ‘అది నన్ను అక్కడ కరిచింది’ అని ఆమెకు చెప్పారు. వెంటనే ఫాంగ్‌ అత్యవసర సేవలకు ఫోన్‌ చేసి, ప్రథమ చికిత్స అందించేందుకు ప్రయత్నించారు.

అయితే కెవెన్‌ ప్రాణాలను కాపాడలేకపోయారు. కుక్క కాటు వల్ల తీవ్ర రక్తస్రావం కావడంతోనే ఆయన మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, కుకీని ప్రమాదకరంగా అదుపు తప్పేలా ఉంచారనే ఆరోపణతో పాటు, దాడి సమయంలో ఆ కుక్క బాధ్యత కూడా ఫాంగ్‌దేననే మరో ఆరోపణను నమోదు చేశారు. దాదాపు మూడేళ్లకు పైగా కొనసాగిన ఈ కేసు చివరకు కోర్టుకు చేరింది.

ఈ ఘటన జరిగిన సమయంలో ఎక్స్‌ఎల్‌ బుల్లీ కుక్కలను వేల్స్‌లో నిషేధిత కుక్కల జాబితాలో చేర్చలేదు. విచారణలో కెవెన్‌ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉండేదని, ఆయన మెథడోన్‌, రక్తాన్ని పలుచన చేసే మందులు తీసుకుంటున్నారని కోర్టుకు తెలిపారు. ఫాంగ్‌ ఇంట్లో ఫైర్‌, రోగ్‌ అనే మరో రెండు ఎక్స్‌ఎల్‌ బుల్లీ కుక్కలతో పాటు మరికొన్ని కుక్కలు కూడా ఉన్నాయని వెల్లడైంది. రోగ్‌.. కుకీ తల్లి. ఆ సమయంలో రోగ్‌ సీజన్‌లో ఉండటంతో దానిని ఇతర కుక్కలకు దూరంగా ఉంచారు.

తన తరఫున వాంగ్మూలం ఇచ్చిన ఫాంగ్‌.. కుక్కల పెంపకం, వాటి రిజిస్ట్రేషన్‌ వంటి వ్యవహారాలన్నింటినీ తన భాగస్వామి జాషువా జోన్స్‌ చూసుకునేవాడని చెప్పారు. కుకీ తనది కాదని, జాషువాకే చెందినదని ఆమె మొదటి నుంచి చెబుతూ వచ్చింది. కెవెన్‌తో తనకు మంచి సంబంధాలు ఉండేవని, ఆయన గతంలో పలు కుక్కలను పెంచుకున్నారని కూడా తెలిపారు. అయితే కుకీ వల్ల ఉన్న ప్రమాదాన్ని తాను తక్కువగా అంచనా వేసినట్లు ఫాంగ్‌ అంగీకరించారు.

ఇరువైపుల వాదనలు విన్న కెర్నార్ఫన్‌ క్రౌన్‌ కోర్టు జ్యూరీ కేవలం మూడు గంటల్లోనే తీర్పు ఇచ్చింది. ఫాంగ్‌పై ఉన్న రెండు ఆరోపణల్లోనూ ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో దాదాపు మూడేళ్లకు పైగా కొనసాగిన కేసుకు ముగింపు పడింది. తీర్పు వెలువడిన సమయంలో ఫాంగ్‌ కన్నీళ్లు పెట్టుకుని, కుటుంబ సభ్యులు, స్నేహితులను ఆలింగనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement