లండన్: భారతీయ మూలాలున్న వ్యూహకర్త, మీడియా ఎగ్జిక్యుటివ్ గౌతమ్ రంగరాజన్ను బ్రిటన్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. యూకే ప్రధాని ఆయన్ను స్ట్రక్చర్ అండ్ ప్రాసెసెస్ (రాజ్యాంగ వ్యవస్థలు, వ్యవహారాలు)పై ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వార్తా సంస్థ బీబీసీలో వ్యూహకర్తగా పనిచేసిన అనుభవమున్న రంగరాజన్ ఇప్పటికే కొత్త పదవీ బాధ్యతలు స్వీకరించారని అని యూకే ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. లేబర్ పార్టీ నేత బర్న్హామ్ గత నెల ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలన వికేంద్రీకరణ చర్యల్లో భాగంగా మ్యాంచెస్టర్లో ‘నంబర్ 10 నార్త్’ను ప్రారంభించారు. పలు ప్రభుత్వ విభాగాల పునర్వవ్యవస్థీకరణ చేపటాట్టరు.
ఎవరీ గౌతమ్ రంగరాజన్?
గౌతమ్ రంగరాజన్ (Gautam Rangarajan) బీబీసీలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేశారు. ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1993లో బీబీసీ రేడియో క్లాసికల్ మ్యూజిక్లో ట్రెయినీ ప్రొడ్యూసర్గా తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత బీబీసీ వేల్స్, బీబీసీ రేడియోలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2013లో గౌతమ్ రంగరాజన్ గ్రూప్ డైరెక్టర్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ పెర్ఫార్మెన్స్గా నియమితులయ్యారు. 2025 ఏప్రిల్ వరకు ఈ పదవిలో కొనసాగారు. గ్రూప్ డైరెక్టర్గా బీబీసీ మొత్తానికి సంబంధించిన వ్యూహరచనకు 10 సంవత్సరాల పాటు బాధ్యత వహించారు.
2025లో బీబీసీని వీడిన తర్వాత ఫ్రీలాన్స్ కన్సల్టెంట్గా పనిచేశారు. 2025 జనవరి నుంచి గ్లైండ్బోర్న్లో బోర్డ్ ట్రస్టీగా కూడా కొనసాగుతున్నారు. టెంపుల్ చర్చ్ క్వైర్తో కలిసి ఆయన పాటలు పాడారు. అలాగే పాలీఫోనీతో పాటు వెస్ట్మినిస్టర్ అబ్బే, సెయింట్ పాల్స్ కేథడ్రల్, విండ్సర్లోని సెయింట్ జార్జ్ చాపెల్ గాయక బృందాలతో డిప్యూటీగా కూడా పనిచేశారు. రికార్డింగ్ ప్రొడ్యూసర్గా కూడా ఆయన పనిచేశారు. 2012లో విడుదలైన A Festival of Psalms అనే సీడీకి కూడా ఆయన రికార్డింగ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు.
చదవండి: విజయ్ పార్టీలో చేరిన యువనేత


