నైజీరియాలో రాబందుల కనుమరుగు.. కాపాడేందుకు ‘వల్చర్ కింగ్‌’ పోరాటం | Nigeria Vulture Conservation: How 'Vulture King' Chukwuemeka Igwe Saved Vultures in Awka-Etiti | Sakshi
Sakshi News home page

నైజీరియాలో రాబందుల కనుమరుగు.. కాపాడేందుకు ‘వల్చర్ కింగ్‌’ పోరాటం

Aug 13 2026 12:17 PM | Updated on Aug 13 2026 12:20 PM

Nigeria Vulture Conservation Vulture King

పశ్చిమ ఆఫ్రికాలో రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. రాబందులు.. చనిపోయిన జంతువుల కళేబరాలను తినడంతో వ్యాధులు వ్యాప్తి చెందకుండా పర్యావరణాన్ని కాపాడుతాయి. అలాంటి రాబందులు తగ్గిపోవడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు వ్యాధుల వ్యాప్తి ప్రమాదం కూడా పెరుగుతోందని పర్యావరణ పరిరక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అలాగే, సంప్రదాయ విశ్వాసాల పేరుతో వాటిని వేటాడటం, విషప్రయోగం చేయడం, వాటి నివాస ప్రాంతాలను ధ్వంసం చేయడం వంటి కారణాలతో పలు రాబందుల జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి.

అయితే నైజీరియాలోని ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న అవ్కా-ఏటీటీ(Awka-Etiti) అనే చిన్న పట్టణం మాత్రం ఇందుకు భిన్నమైన ఉదాహరణగా నిలుస్తోంది. అక్కడి ప్రజలు రాబందులను పవిత్ర పక్షులుగా భావిస్తూ వాటిని రక్షిస్తున్నారు.

దేవతకు నైవేద్యం.. రాబందులకు ఆహారం
అవ్కా-ఏటీటీలో(Awka-Etiti) ‘న్గుమా’ అనే దేవతకు అంకితమైన ఓ పురాతన పుణ్యక్షేత్రం చుట్టూ పవిత్ర అడవి ఉంది. అక్కడ రాబందులు తరతరాలుగా సంచరిస్తున్నాయి. స్థానికుల సంప్రదాయ ఆచారాల్లో భాగంగా రాబందులకు ఆహారం లభిస్తుండటంతో అవి తరచూ ఆలయ పరిసరాలకు చేరుతుంటాయి. అలాగే, చుక్వుమెకా ఇగ్వే(Chukwuemeka Igwe) అనే స్థానికుడు రాబందుల పరిరక్షణ కోసం చేస్తున్న కృషితో ‘వల్చర్ కింగ్‌’గా పేరొందాడు. ‘ఇక్కడి స్థానికులు రాబందులను వేటాడరు. నైవేద్యం సమర్పించిన తర్వాత రాబందులు కనిపిస్తే దేవత తమ ప్రార్థనను స్వీకరించినట్లుగా భావిస్తారు’’ అని ఆయన చెబుతున్నారు.

రాబందులు లేకపోతే వ్యాధుల ముప్పు
రాబందులను కేవలం కళేబరాలను తినే పక్షులుగా చూడటం తప్పని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవి ప్రకృతికి అత్యంత కీలకమైన ‘క్లీనింగ్ సర్వీస్‌’ అందిస్తాయి. దీంతో చనిపోయిన జంతువుల కళేబరాలను కొన్ని గంటల్లోనే తినేయడం ద్వారా ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వ్యాధికారక సూక్ష్మజీవులు వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటాయి.

వాటి జీర్ణాశయంలోని శక్తివంతమైన ఆమ్లాలు.. ఆంత్రాక్స్‌, రేబిస్‌ వంటి వ్యాధులతో చనిపోయిన జంతువులను కూడా జీర్ణించుకోగలుగుతాయి. రాబందుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిన ప్రాంతాల్లో జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధులు పెరిగినట్లు పరిశోధనలు సూచిస్తున్నాయని నైజీరియా కన్జర్వేషన్ ఫౌండేషన్‌(NCF) జీవశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

50 ఏళ్లలో 80–97 శాతం తగ్గుదల
బర్డ్‌లైఫ్ ఇంటర్నేషనల్‌ నివేదిక ప్రకారం.. ఆఫ్రికాలో గత 50 ఏళ్లలో రాబందుల సంఖ్య 80 నుంచి 97 శాతం వరకు పడిపోయింది. దీంతో ఆఫ్రికాలోని ఏడు రాబందుల జాతులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతులుగా గుర్తించబడ్డాయి. విషప్రయోగం రాబందుల మరణాలకు ప్రధాన కారణంగా మారింది. ఆఫ్రికాలో రాబందుల మరణాల్లో సుమారు 60 శాతం విషప్రయోగం వల్లేనని అంచనా.

ఒక్క రాబందు ధర రూ.1.6 లక్షలు!
సంప్రదాయ వైద్యం, ఆధ్యాత్మిక విశ్వాసాల పేరుతో రాబందులు, వాటి శరీర భాగాలకు డిమాండ్ పెరుగుతోంది. నైజీరియాలో గతంలో ఒక రాబందు ధర సుమారు 25 నుంచి 30 వేలు ఉండేది. ఇప్పుడు అదే పక్షి 2 లక్షల వరకు పలుకుతోందని పరిరక్షణ నిపుణులు చెబుతున్నారు.

రాబందుల గుడ్లు, గూళ్లను కూడా అక్రమంగా సేకరిస్తున్నారు. ఇవి నెమ్మదిగా సంతానోత్పత్తి చేసే పక్షులు అవడంతో ఈ చర్య వాటి మనుగడకు హాని కలిగించేదిగా మారుతుంది. సాధారణంగా రాబందులు ఐదు నుంచి ఏడు సంవత్సరాల వయసులో సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. అలాగే, ఒకటి లేదా రెండేళ్లకు ఒక పిల్లను మాత్రమే పెంచుతాయి. దీంతో ఒక్క గూడు, గుడ్డును నష్టపోయినా ఆ జంటకు ఆ ఏడాది మొత్తం కొత్త తరం ఏర్పడే అవకాశం కోల్పోతుంది.

20 నుంచి 160కి పెరిగిన రాబందులు
కొన్నేళ్ల క్రితం అవ్కా-ఏటీటీలోకి బయటి ప్రాంతాల నుంచి వేటగాళ్లు రావడం ప్రారంభించడంతో స్థానికులు ఆందోళన చెందారు. రాబందుల సంఖ్య కూడా తగ్గిపోయింది. దీంతో ఇగ్వే నైజీరియా కన్జర్వేషన్ ఫౌండేషన్‌తో కలిసి రాబందుల సంరక్షణ కోసం ప్రచారం ప్రారంభించారు. మార్కెట్లు, బస్సులు, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు రాబందుల ప్రాధాన్యాన్ని వివరిస్తూ అవగాహన కల్పించారు. అలాగే, స్థానిక నాయకులు, స్వచ్ఛంద కార్యకర్తలు, భద్రతా సిబ్బందిని కలుపుకుని బయటి వేటగాళ్లను అడ్డుకునే చర్యలు చేపట్టారు.

స్థానిక నిబంధనలను కూడా అమలు చేయడంతో పరిస్థితి మారింది. దీంతో 2017లో అవ్కా-ఏటీటీలో సుమారు 20 రాబందులు మాత్రమే కనిపించగా.. ప్రస్తుతం 160కిపైగా రాబందులను గుర్తించినట్లు స్వచ్ఛంద కార్యకర్తలు చెబుతున్నారు.

ఒక్క ఊరి ప్రయత్నం.. ప్రపంచానికి పాఠం
రాబందుల అక్రమ రవాణాకు నైజీరియా ప్రధాన కేంద్రంగా మారిందని పరిరక్షణ సంస్థలు చెబుతున్నాయి. దేశంలోని జీవవైవిధ్యం, సరిహద్దుల వద్ద ఉన్న చెడు పరిణామాలు అక్రమ వ్యాపారానికి అనుకూలంగా మారుతున్నాయని నిపుణులు అంటున్నారు. అక్రమంగా తరలిస్తున్న రక్షిత వన్యప్రాణులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ.. కేవలం చట్టం అమలుతోనే సమస్య పరిష్కారం కాదని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజల్లో అవగాహన పెంచడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

అవ్కా-ఏటీటీ వంటి ప్రాంతంలోని స్థానికుల భాగస్వామ్యమే రాబందుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమైందని వారు చెబుతున్నారు. 'కనుమరుగైన రాబందులు దాదాపు తిరిగి వస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్‌ ప్రాంతాల్లో కూడా వాటిని చూస్తున్నాం. ఒకప్పుడు ఇవి పూర్తిగా కనిపించకుండా పోయాయి. ఇప్పుడు మళ్లీ వస్తున్నాయి' అని వల్చర్ కింగ్‌ ఇగ్వే చెబుతున్నారు. అలాగే, ప్రకృతి తన సహజ స్థితిలో కొనసాగేందుకు తాను పోరాడుతున్నానని ఆయన అంటున్నారు. ఒక చిన్న పట్టణం చూపించిన ఈ మార్గం.. ఆఫ్రికా అంతటా రాబందుల పరిరక్షణకు ఆశాకిరణంగా మారుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement