కలత పక్షులు | Half of the eleven thousand migratory bird species are at risk of extinction | Sakshi
Sakshi News home page

కలత పక్షులు

Aug 3 2026 2:23 AM | Updated on Aug 3 2026 2:23 AM

Half of the eleven thousand migratory bird species are at risk of extinction

మనిషికీ, పక్షికీ, ఆమాటకొస్తే అన్ని ఇతర జీవులకూ మధ్య పరిమాణంలో, రూపంలో, శక్తియుక్తుల్లో పైకి కనిపించే తేడాలే తప్ప మనుగడతో ముడిపడిన మౌలికమైన తేడాలు లేవు. పక్షులనే తీసుకుంటే, మనిషి గుడిసె కట్టుకుంటే అవి గూడు కట్టుకుంటాయి; మనిషిలానే ఆహారాన్ని వెతుక్కుంటాయి, సంతానాన్ని కంటాయి, కంటికి రెప్పలా వాటిని కాపాడుకోవాలనుకుంటాయి. ఇతరేతర మైన తేడాలకు అతీతంగా ప్రతిజీవీ తన అస్తిత్వాన్ని నిలుపుకోడానికీ, తన పరంపరను కొనసాగించుకోడానికీ ప్రకృతి సమదృష్టితో చేసిన ఏర్పాటు అది. అందుకు ఏ జీవికి ఎంత తెలివి కావాలో అంత తెలివీ ప్రకృతి వాటికిచ్చింది. ఇందులో జీవవైవిధ్యమే తప్ప ఎక్కువ తక్కువలు లేవు. ఉదాహరణకు, మనిషి పక్షిలా ఎగరలేడు, కండబలంలో పెద్ద పులితో, సింహంతో పోటీ పడలేడు; అలాగే, మనిషి చేయగలిన పనులను అనేకమైన ఇతర జీవులూ చేయలేవు. 

కానీ, తెలివి వికటించిన మనిషి వివేకపు హద్దులు దాటి తనకు ఉనికినిచ్చిన ప్రకృతినే సవాలు చేస్తున్నాడు; ప్రకృతి ప్రణాళికలోనే వేలుపెడుతున్నాడు; తన స్థాయి మరచిప్రకృతిపైనే పైచేయిని చాటుతున్నాడు! దాని పర్యవసానాలు తన మనుగడకే ముప్పు తెస్తాయనే స్పృహ లేకుండా తన తెలివికి తనే తలకొరివి పెట్టుకుంటున్నాడు! 

ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పదకొండు వేల వలస పక్షుల రకాల్లో సగం అంతరించే ప్రమాదంలో ఉన్నాయి. మన దేశంలో స్థానికంగా ఉన్న ఇతర పక్షుల కన్నా, ఆర్కిటిక్‌ వంటి సుదూర ప్రాంతాలనుంచి ఎగిరొచ్చే వలస పక్షులుమరింత త్వరితగతిన క్షీణిస్తున్నాయి. దశాబ్దాలుగా పర్యావరణానికి జరుగుతున్న హానినలా ఉంచి, వలస పక్షుల గురించి తగిన అవగాహన లేమినీ, ఇతర కారణాలనూ ఈ అధ్యయనం దండగుచ్చింది. 

వలస పక్షులు ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్య పరిరక్షణలో; క్రిమికీటక జనాభా నియంత్రణలో; విత్తనాలు వెదజల్లీ, పరాగ సంపర్కం ద్వారా మొక్కల అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. పర్యావరణ భిన్నత్వం ఉన్న వేర్వేరు ఖండాలలో సైతం ఆహార వ్యవస్థ దెబ్బతినకుండా సాయపడుతున్నాయి. అటువంటిది, సొంత మనుగడకే ముప్పు ముంచుకొస్తున్న పరిస్థితిలో వలస పక్షులు కలత పక్షులవుతున్నాయి. ప్రమాద స్థాయిని అంచనా వేయడానికి మనం దూరదూరాలకు ఎగిరి వెళ్ళనవసరం లేదు. మన నట్టింట ఉన్న కొల్లేరు సరసువైపు దృష్టి సారిస్తే చాలు. 

వలస పక్షుల శీతకాలపు విడిదిగా, మత్స్యసంపద నిండిన మంచినీటి కొలనుగా ప్రపంచ ప్రసిద్ధినొందిన కొల్లేటి సరస్సుపై ఉత్తరాసియా, సైబీరియా, తూర్పు యూరప్‌లనుంచి కొంగలు, బాతులు, నేల నెమళ్ళు పెద్దసంఖ్యలో వచ్చి వాలతాయి. క్రమంగా సరస్సు పరిధిలో చేపలు, రొయ్యల చెరువులు విస్తరించడం, రసాయనిక వ్యర్థాలు కలిసి నీరు కలుషితం కావడం, పూడిక పేరుకు పోవడం, ప్రకృతిసిద్ధమైన ఇతర కారణాలూ నీటి నాణ్యతనూ, పరిమాణాన్ని దెబ్బతీసి మత్స్యసంపదను హరించడంతో అతిథి పక్షులకు ఆహారమూ, ఆశ్రయమూ కరువవు తున్నాయి. వాటి సంఖ్యపై అది దుష్ప్రభావం చూపుతోంది. 

చెట్టూ చేమనే కాక, పక్షీ పామునూ కూడా పూజించి సహజీవనం చేసిన చరిత్ర మనిషిది. రెక్కబలమే ఇంధనంగా దిక్కులు ముడివేస్తూ వేలమైళ్ళ దూరాన్ని అవలీలగా తరించే పక్షిని తనకన్నా మిన్నగా గౌరవించిన ఘనతా అతనిది. వేటగాడు క్రౌంచపక్షుల జంటలో మగపక్షిని చంపి ఆడపక్షికి కలిగించిన శోకమే శ్లోకమై ఆదికావ్యమైన రామాయణమైంది. సీతనెత్తుకెడుతున్న రావణునితో పోరాడి గాయపడి, తనకా సమా చారమందించి కన్నుమూసిన జటాయువుపట్ల కృతజ్ఞతతో రాముడే స్వయంగా దానికి అంత్యక్రియలు జరిపిన అపురూప ఘట్టమూ రామాయణంలో ఉంది. 

భారతీయ వాఙ్మయంలో పక్షి భాగం కాని ఇతిహాస కావ్యాలే లేవు. భారతీయ దేవీదేవతల చేతుల్నే కాదు, గ్రీకు సహా ఇతర దేవతల హస్తాలనూ అలంకరించిన మహద్వైభవం పక్షిది. అటువంటిది, ప్రకృతిమార్గం విడిచి పెడమార్గం పట్టిన మనిషి, ఒకప్పటి తన ముంజేతి ముద్దులపక్షి మనుగడకే ముప్పుగా మారడం దారుణం. అలా తన మనుగడనే ప్రశ్నార్థకం చేసుకునే దిశగా పడుతున్న అడుగును ఎప్పటికి వెనక్కి తీసుకుంటాడో! సకల జీవులతో ఒకప్పటి తన చెలిమినీ, కూరిమినీ ఎప్పటికి పునరుద్ధించుకుంటాడో!! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement