కోల్కతా: పశ్చిమ బెంగాల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పాకిస్థాన్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హమిమ్ మండల్ అనే ఉగ్రవాద అనుమానితుడిని తూర్పు బర్ధమాన్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన నిరసనల్లో పోలీసుల వేషధారణలో చొరబడి అల్లర్లు సృష్టించాలనేది ఈ ఉగ్రవాద కుట్ర ప్రధాన లక్ష్యమని ఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ గౌరవ్ శర్మ తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి కదలికలపై నిఘా ఉంచాలని, రక్షణ లేని ప్రాంతాల వివరాలు సేకరించాలని పాకిస్థాన్ హ్యాండ్లర్లు హమిమ్ను ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని కోర్టు 14 రోజుల ఎస్టీఎఫ్ కస్టడీకి అప్పగించింది.
మరోవైపు, హమిమ్ ప్రియురాలు అర్పితా సర్కార్ను శుక్రవారం జార్ఖండ్లో పోలీసులు అరెస్ట్ చేశారు. షాజాద్ భట్టీ గ్యాంగ్కు చెందిన పాకిస్థాన్ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు వీరిద్దరూ ఈ కుట్రకు పాల్పడ్డారు. రాజకీయ నాయకులు, ప్రముఖులను హానీట్రాప్ చేసి, వారి నుంచి రహస్య సమాచారం రాబట్టడంలో అర్పితా సర్కార్ సిద్ధహస్తురాలని పోలీసుల విచారణలో తేలింది. రాష్ట్ర మంత్రి ఉమేష్ రాయ్ కుమారుడిని హానీట్రాప్ చేసి కిడ్నాప్ చేయడానికి, కుటుంబం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడానికి వారు ప్లాన్ చేశారు.
నిందితుల వద్ద నుంచి బ్రిటన్, మెక్సికో దేశాలకు చెందిన అంతర్జాతీయ సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ హ్యాండ్లర్లు రానా, ఉజైర్, అబిద్ జాట్, హమాద్లతో ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా వీరు సంభాషణలు జరిపినట్లు ఎస్టీఎఫ్ గుర్తించింది. సోషల్ మీడియా ద్వారా రాడికలైజ్ అయిన వీరిద్దరూ గత నాలుగేళ్లుగా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై ప్రేమలో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరి ఉగ్రమూలాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: ‘పొట్టకూటి కోసం వెళ్తే ప్రాణాలే తీశారు’


