పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడి హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఇప్పటివరకు రాజకీయ ప్రత్యర్థుల కుట్ర కోణంలో కేసు దర్యాప్తు కొనసాగగా.. తాజాగా ఇద్దరు బీజేపీ కార్యకర్తలనే సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. దీంతో ఈ కేసు మరోసారి బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
అరెస్టైన వారిని సాగర్ సోంకర్, సాహెబ్ సోంకర్గా గుర్తించారు. వీరిద్దరూ సోదరులని, గతంలో చంద్రనాథ్ రథ్ టీమ్లో పనిచేసిన వారేనని సీబీఐ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం వీళ్లు బీజేపీలో సభ్యులుగా కొనసాగుతున్నట్లు సమాచారం. హత్యకు ముందు రెక్కీ నిర్వహించడం, దాడికి అవసరమైన ఏర్పాట్లు చేయడం, షూటర్లతో మాట్లాడుకుని ప్లాన్ చేయడం వీళ్లిద్దరి పనేనని గుర్తించారు. అయితే హత్యకు అసలు కారకులు ఎవరు? కారణం ఏంటి? అనేది ఇంకా తేలాల్సి ఉంది.
సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ హత్య ఘటన పశ్చిమ బెంగాల్లో తీవ్ర కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మే 6న ఉత్తర 24 పరగణాల జిల్లా మాధ్యమ్గ్రామ్ ప్రాంతంలో చంద్రనాథ్ రథ్ తన ఎస్యూవీలో ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటన సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మూడు రోజుల ముందు జరగడంతో అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ ప్రత్యర్థుల కుట్రగా బీజేపీ నేతలు ఆరోపించగా.. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. తొలుత బెంగాల్ పోలీసులు సిట్ ఏర్పాటు చేయించి దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో యూపీ, బిహార్ నుంచి కొందరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసు సీబీఐకి చేరింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేయడం గమనార్హం.
హత్యకు ముందే వ్యూహం?
సీబీఐ దర్యాప్తులో భాగంగా హత్యను పక్కా ప్రణాళికతో అమలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు ముందుగానే షూటర్లను ఎంపిక చేయడం, వారికి అవసరమైన వాహనాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ఘటనకు ముందు ప్రాంతాన్ని పరిశీలించడం వంటి అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో తాజా అరెస్టులతో కలిపి ఇప్పటివరకు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లైంది.
బీజేపీ కార్యకర్తలే ఎందుకు అనుమానితులు?
తాజా పరిణామాల్లో ప్రధాన అంశం.. అరెస్టైన ఇద్దరూ బీజేపీ కార్యకర్తలు కావడం. వీరు ఒకప్పుడు చంద్రనాథ్ రథ్తో కలిసి పనిచేసినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే దర్యాప్తులో భాగంగా వీరికి ప్రత్యర్థి రాజకీయ వర్గాలతో కూడా సంబంధాలు ఉన్నాయా? అనే కోణాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. రాజకీయ విభేదాలా? వ్యక్తిగత కక్షలా? లేక మరేదైనా కారణమా? అనే అంశాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఇటు బీజేపీ మాత్రం వాళ్లు గతంలో సువేందు టీఎంసీలో ఉన్నప్పుడు.. చంద్రనాథ్ రథ్ టీంలో పని చేశారని అంటున్నారు.
అప్పట్లో సువేందు ఆరోపణలు..
చంద్రనాథ్ రథ్ హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని సువేందు అధికారి గతంలో ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదల, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీపై సాధించిన విజయం నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉండొచ్చని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు.
కొత్త మలుపు.. అసలు కుట్రదారులు ఎవరు?
తాజా అరెస్టులతో చంద్రనాథ్ రథ్ హత్య కేసు కీలక దశకు చేరుకుంది. ఒకవైపు రాజకీయ కుట్ర కోణం, మరోవైపు సొంత వర్గంలో ఉన్న వ్యక్తుల పేర్లు తెరపైకి రావడం.. కేసును మరింత సంక్లిష్టంగా మార్చింది.


