న్యూఢిల్లీ: ఉద్యోగంలో చివరి రోజున పెండింగ్ పనులను పూర్తి చేయడం, బాధ్యతలను సహచరులకు అప్పగించడం, వీడ్కోలు స్వీకరించడమనేవి జరుగుతుంటాయి. అయితే, ఒక ఉద్యోగికి మాత్రం తన సర్వీస్లో చివరి రోజే మేనేజర్ నుంచి కొత్త పనులు స్వీకరించాల్సిరావడం అతనిని విస్మయానికి గురిచేసింది. ఈ విచిత్రమైన ఘటనకు సంబంధించిన వివరాలు రెడిట్ వేదికగా వైరల్ అయ్యాయి. నలుగురు ఉద్యోగులు మాత్రమే ఉన్న ఒక రిమోట్ స్టార్టప్ కంపెనీలో ఆ ఉద్యోగి పనిచేస్తున్నారు.
తన రాజీనామాకు తక్కువ వేతనమే కారణమని చెప్పేందుకు భయపడి, తాను విదేశాలకు వెళ్తున్నానంటూ అబద్ధం చెప్పి, ఉద్యోగం మానేస్తున్నానని చెప్పారు. అయితే, ఆయనకు ఉద్యోగంలో అదే చివరి రోజైనప్పటికీ, ఉదయం జరిగిన ఆన్లైన్ సమావేశంలో మేనేజర్ పలు పనులను కేటాయించారు. చివరి రోజు కావడంతో బాస్ మర్చిపోయి ఉంటారనే ఉద్దేశంతో ఆ ఉద్యోగి వాటిని పూర్తి చేశారు. అయినప్పటికీ మరికొన్ని పనులు మిగిలిపోవడంతో, మేనేజర్ వాటిని కూడా పూర్తిచేయాలంటూ మరింత ఒత్తిడి తెచ్చారు. త్వరలో జరగనున్న ప్రొడక్ట్ లాంచ్ కారణంగా, మరో పది రోజులు సహాయం చేయాలని, కేవలం చిన్న పనులే ఇస్తామని మేనేజర్ కోరడంతో ఆ ఉద్యోగి అయిష్టంగానే అంగీకరించారు.
అధికారికంగా ఉద్యోగం ముగిసిన తర్వాత కూడా రిమోట్ విధానం కారణంగా తనతో బలవంతంగా పనులు చేయించుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఉద్యోగం పూర్తయిన విషయాన్ని మేనేజర్కు స్పష్టంగా గుర్తుచేయాలని కొందరు సలహా ఇస్తే, నోటీస్ పీరియడ్ కొత్త పనుల కోసం కాదని, బాధ్యతల బదిలీకి మాత్రమేనని మరికొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు బాస్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, శాపనార్ధాలు పెడుతున్నారు. చివరి రోజు చేసిన పనుల వివరాలను ఈమెయిల్ ద్వారా పంపి, మిగిలిన పనులపై స్పష్టత ఇవ్వాలని బాస్ అతనికి సూచించడం కొసమెరుపు.
ఇది కూడా చదవండి: కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి!


