జెన్‌జీ టెన్షన్‌?.. CJI కార్యక్రమం వాయిదా! | CJI’s TISS Convocation Postponed, Security Concerns Rise Over Possible Gen Z Protests, Check More Details Inside | Sakshi
Sakshi News home page

జెన్‌జీ టెన్షన్‌?.. CJI కార్యక్రమం వాయిదా!

Aug 1 2026 12:11 PM | Updated on Aug 1 2026 12:57 PM

Gen Z Stir: CJIs TISS Event Postponed Amid Protest Concerns

విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టమైన కాన్వొకేషన్‌ వేడుక. అలాంటి వేడుకకు దేశ ప్రధాన న్యాయమూర్తి హాజరు కావడంపై వాళ్లు ఒకింత ఎగ్జయిటింగ్‌గా ఫీలయ్యారు. తల్లిదండ్రుల కోసం టికెట్లు.. హోటల్‌ రూమ్స్‌ అన్నీ బుక్‌ చేసుకుని కార్యక్రమానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఆ సమయంలోనే అనూహ్యంగా కార్యక్రమం వాయిదా పడడంతో వందలాది మంది నిరాశకు లోనయ్యారు.

మహారాష్ట్ర ముంబైలోని ప్రతిష్ఠాత్మక టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (TISS) తన 86వ కాన్వొకేషన్‌ వేడుకను ఆకస్మికంగా వాయిదా వేసింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే ఆగస్టు 2న జరగాల్సిన ఈ వేడుకను “అనుకోని పరిస్థితులు” కారణంగా వాయిదా వేస్తున్నట్లు TISS‌ రిజిస్ట్రార్‌ విద్యార్థులకు ఈమెయిల్‌ ద్వారా సమాచారం అందించారు. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అయితే ఈ నిర్ణయం వెనుక భద్రతా కారణాలు ఉన్నాయనే చర్చ మొదలైంది.

కాక్రోచ్‌ నిరసనల భయమేనా?
TISS‌ అధికారికంగా కారణాలను వెల్లడించకపోయినా.. క్యాంపస్‌లో భద్రతాపరమైన ఆందోళనలు, సాధ్యమైన నిరసనలపై వచ్చిన సమాచారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) ఉద్యమానికి సంబంధించిన నిరసనలు కాన్వొకేషన్‌ సమయంలో చోటుచేసుకునే అవకాశం ఉందన్న నిఘా సమాచారంతో అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పలువురు ప్రముఖులు పాల్గొనే కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా వేడుకను వాయిదా వేసినట్లు సమాచారం.

CJIతో పాటు పలువురు ప్రముఖులు.. 
ఈ కాన్వొకేషన్‌కు జస్టిస్‌ సూర్యకాంత్‌ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అలాగే బాంబే హైకోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ రవీంద్ర ఘుగే కూడా కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. దేశంలోని ప్రముఖ న్యాయవ్యవస్థకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొనే కార్యక్రమం కావడంతో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కాన్వొకేషన్‌ వాయిదాకు నిరసనలే కారణమని TISS‌ అధికారికంగా ప్రకటించలేదు. భద్రతా పరిస్థితులు, అనుకోని పరిణామాల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయమని మాత్రమే సంస్థ వెల్లడించింది.

టికెట్లు బుక్‌.. చివరికి వాయిదా
కాన్వొకేషన్‌ కోసం విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. కొందరు విమాన టికెట్లు, మరికొందరు రైలు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. హోటల్‌ గదులు కూడా రిజర్వ్‌ చేసుకున్నారు. 
చివరి నిమిషంలో కార్యక్రమం వాయిదా పడటంతో ప్రయాణ ఖర్చులు, వసతి కోసం చేసిన ఖర్చులు వృథా అయ్యాయని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థులకు కొత్త తేదీ ఎప్పుడు ప్రకటిస్తారన్న ఆందోళన కూడా నెలకొంది.

ఆర్థిక నష్టంపై పరిశీలన
విద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తించిన TISS‌.. ఆర్థిక నష్టంపై వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తామని తెలిపింది. అవసరమైన వారికి తాత్కాలిక ధ్రువపత్రాలు అందిస్తామని, కొత్త కాన్వొకేషన్‌ తేదీని త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

బొద్దింకల వ్యాఖ్యలతోనే..
అప్పట్లో ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ సూర్యకాంత్‌ కొందరు నిరుద్యోగ యువతను ఉద్దేశిస్తూ “కాక్రోచ్‌లు”, “పరాన్నజీవులు” వంటి పదాలు ఉపయోగించారని ప్రచారం జరిగింది. ఆ వ్యాఖ్యలకు నిరసనగానే.. కాక్రోచ్‌ జనతా పార్టీని మహారాష్ట్రకే చెందిన అభిజిత్‌ దీప్కే ప్రారంభించాడు. అది.. నీట్‌ నిరసన ఉద్యమంతో ఎంత పని చేసిందో అందరికీ తెలిసిందే. అయితే.. తాను యువతను ఉద్దేశించి అలా అనలేదని, నకిలీ డిగ్రీలతో ప్రాక్టీస్‌ చేస్తున్న లాయర్లనే అన్నానని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ తరచూ వివరణ ఇస్తూ వస్తున్నారు. మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారంటూ మొన్నీమధ్యే ఆవేదన వ్యక్తం చేశారు. అంతెందుకు.. 

జంతర్‌ మంతర్‌ నిరసనల పిటిషన్‌ను కూడా ఆయన బెంచే ఇప్పుడు విచారణ జరుపుతుండడం గమనార్హం. ఈ తరుణంలో.. CJI హాజరు కావాల్సిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అలాంటి నిరసనలు జరుగుతాయనే అనుమానంతో చివరి నిమిషంలో వాయిదా పడటం కొత్త చర్చకు దారితీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement