కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న
అందరికీ బీఎన్ఎస్ సెక్షన్ 82 అమలుకు డిమాండ్
న్యూఢిల్లీ: ముస్లింలలో బహుభార్యత్వాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై తన వైఖరి ఏమిటో చెప్పాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మహిళ హక్కుల కార్యకర్తలు జాకియా సోమన్, నూర్జహాన్ సాఫియా నియాజ్ తదితరులు దాఖలు చేసిన ఈ పిటిషన్ను విచారణకు చేపట్టిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన బెంచ్ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
పిటిషన్ను ఇతర పెండింగ్ కేసులకు జతచేసింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 82 ప్రకారం రెండో వివాహం చేసుకున్న వారు శిక్షార్హులని, ఇది అందరికీ వర్తిస్తుందని, ముస్లిం పర్సనల్ లా బోర్డుకు ఈ విషయంలో ఏవైనా మినహాయింపులు ఉన్నా వాటిని తొలగించిందని పిటిషనర్లు వాదించారు. ఈ కారణంగా కేంద్రం బహుభార్యత్వాన్ని రద్దు చేసేలా కేంద్రం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మతాలకు అతీతంగా అందరికీ ఇది వర్తించేలా చేయాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా... ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ, భద్రతలకు సంబంధించి అనేక మార్గదర్శకాలను కోరిన పిటిష నర్లు ముస్లింల వివాహాలు, విడాకులు రెండింటినీ తప్పనిసరిగా రిజిస్టర్ చేసేలా కూడా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. బహుభార్యత్వం కేసులను వేగంగా పరిష్కరించాలని, మొదటి భార్య, పిల్లలకు అత్తవారి ఇంటిపై హక్కు కల్పించాలని కోరారు.
షరియత్ చట్టానికి సవాలు...
పిటిషనర్లు 1937 నాటి ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్ లోని సెక్షన్ రెండును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ సెక్షన్ ముస్లింలలో బహు భార్యత్వం ఆమోదయోగ్యం చేస్తుంది. అయితే ఈ సెక్షన్ కారణంగా భారత న్యాయ సంహితలోని సెక్షన్ 82 కింద రెండో వివాహానికి సంబంధించి మహిళలందరికీ లభిస్తున్న రక్షణ ముస్లిం మహిళలకు మాత్రం దక్కకుండా పోతోందని, న్యాయపరమైన ఈ అంతరాన్ని సవరించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రియా మైనీ వాదించారు.
బహుభార్యత్వం సహజంగానే వివక్షపూరితమైందని, ఆర్టికల్ 14, 15, 21లకు విరుద్ధమని వాదించారు. ‘‘ముస్లిం పర్సనల్ లా లోని సెక్షన్ 2 ఇతర సామాజిక వర్గాలన్నింటిలో నేరంగా పరిగణించే విషయానికి మతపరమైన రక్షణ కల్పిస్తోంది. ఇది న్యాయసూత్రమైన ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా పరీక్షకు నిలబడదు. బహుభార్యత్వం మహిళలు, పిల్లలపై చెరిగిపోని ముద్ర వేస్తుంది. గౌరవ మర్యాదలతో బతికేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుకు ఇది విరుద్ధం’’అని పిటిషన్లో వివరించారు. మతస్వేచ్ఛ రాజ్యాంగ నైతికతపై ఆధారపడి ఉంటుందని ఆర్టికల్ 25 చెబుతుందని, పితృస్వామిక సంప్రదాయల కంటే స్త్రీ, పురుష సమానత్వానికి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు.


