పార్లమెంట్‌ పవిత్రతను కాపాడండి  | Om Birla issued a stern warning to Members of Parliament rules | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ పవిత్రతను కాపాడండి 

Aug 1 2026 5:00 AM | Updated on Aug 1 2026 5:00 AM

Om Birla issued a stern warning to Members of Parliament rules

లేదంటే కఠిన చర్యలు తీసుకుంటాం  

లోక్‌సభలో విపక్ష ఎంపీలపై స్పీకర్‌ ఓం బిర్లా ఆగ్రహం  

రాజ్యసభలోనూ విపక్షాలను తప్పుపట్టిన చైర్మన్‌ రాధాకృష్ణన్‌  

ఉభయ సభలు సోమవారానికి వాయిదా

సాక్షి, న్యూఢిల్లీ:  పార్లమెంట్‌ ఉభయ సభల్లో విపక్ష సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై సభాధ్యక్షులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా కార్యక్రమాలను పదేపదే అడ్డుకోవడం, విభిన్న వేషదారణల్లో సభకు హాజరు కావడంపై సభ్యులకు హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు మొదలైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వారి వ్యవహార శైలిని స్పీకర్‌ ఓం బిర్లా తప్పుపట్టారు. ప్రశ్నోత్తరాల సమయం సభ్యులకు అత్యంత ముఖ్యమైనదని, ఉద్దేశపూర్వకంగా సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేశారు. 

‘‘సభలో అర్థవంతమైన చర్చలు, సంభాషణల కోసం ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. సభ గౌరవం, పవిత్రతను కాపాడటం ప్రతి సభ్యుడి బాధ్యత’’అని తేల్చిచెప్పారు. సభలో ప్లకార్డులు, బ్యానర్లు తీసుకురావడం పార్లమెంట్‌ సంప్రదాయాలు, మర్యాదలకు విరుద్ధమని పేర్కొన్నారు. అలాంటి చర్యలను దూరంగా ఉండాలని సూచించారు. ఇదే సమయంలో కొందరు సభ్యులు వేషధారణ మార్చుకుని సభకు రావడంపైనా స్పీకర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘పార్లమెంట్‌ గౌరవానికి భంగం కలిగించేలా వేషాలు వేసుకుని రావడం తగదు. సభ పవిత్రత, గౌరవాన్ని కాపాడడం అందరి బాధ్యత. ఇటువంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటాం’’అని హెచ్చరించారు.  

సభ్యుల హక్కులను హరించొద్దు  
కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా తన ప్రశ్న అడగడానికి నిలుచున్నప్పటికీ, ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో ప్రశ్నోత్తరాలు జరగలేదు. స్పీకర్‌ స్పందిస్తూ.. ‘‘ప్రియాంక గాంధీ ప్రశ్న అడగడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా సభను అడ్డుకోవడం సభ్యుల హక్కులను హరించడమే అవుతుంది’’అని స్పష్టంచేశారు. అయినప్పటికీ విపక్షాల ఆందోళన ఆగకపోవడంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత విపక్షాల ఆందోళన మధ్యే ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ బర్త్స్‌ అండ్‌ డెత్స్‌(సవరణ) బిల్లు–2026ను ప్రవేశపెట్టింది. విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తుండడంతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అభ్యంతరం తెలిపారు. ప్రతిపక్ష తీరును ఖండించారు. ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో స్పీకర్‌ సభను సోమవారానికి వాయిదా వేశారు.  

ఎగువ సభలోనూ అదే నిరసన  
రాజ్యసభలోనూ నిరసనల పర్వం కొనసాగింది. విపక్షాలపై ఛైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్‌ మండిపడ్డారు. ‘‘మీరు మాట్లాడేది వినాలని అందరూ కోరుకుంటున్నారు. మీరు మాత్రం ఎవరి మాటా వినడానికి ఇష్టపడం లేదు. ఇది ముమ్మాటికీ తప్పే. అది నియంతృత్వం. మీరు ప్రజాస్వామ్య విలువలకు గౌరవం ఇవ్వడం లేదు. మీరు ఇతరులు చెప్పేది సైతం వినాలి’’అని విపక్షాలకు సూచించారు. ఈ సమయంలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇవ్వగా, ఆయన రూల్‌ 267కింద విద్యార్థులపై పోలీసుల దాడి అంశాన్ని ప్రస్తావిస్తుండగానే చైర్మన్‌ సభను సోమవారానికి వాయిదా వేశారు.   

విరాళాల చోరీపై వినూత్న నిరసన  
అయోధ్య రామాలయ విరాళాల చోరీపై విపక్షాలు పార్లమెంట్‌ మకర ద్వారం వద్ద వినూత్న రీతిలో నిరసన తెలిపాయి. స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్‌ కాషాయ వస్త్రాలు ధరించి హిందూ పూజారి వేషంలో విరాళాల పెట్టెతో వీధి నాటకం తరహాలో నిరసనకు దిగారు. హుండీ సొమ్ము వ్యవహారంలో జరిగిన అక్రమాలను ప్రతీకాత్మకంగా చూపించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రతిపక్ష నేతలు తెలిపారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా ఈ నిరసనలో పాల్గొని, విరాళాల పెట్టెలో డబ్బులు వేశారు. ఆయనతోపాటు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పారీ్టల ఎంపీలు సైతం నిరసనలో పాలుపంచుకున్నారు. విరాళాల చోరీపై పార్లమెంట్‌లో చర్చ నిర్వహించాలంటూ నినాదాలతో హోరెత్తించారు.

లోక్‌సభలో జనన, మరణాల(సవరణ) బిల్లు ఆమోదం 
న్యూఢిల్లీ: జనన మరణాల రిజిస్ట్రేషన్‌ (సవరణ) బిల్లు–2026ను లోక్‌సభ శుక్రవారం ఆమోదించింది. జూలై 20న జరిగిన పార్లమెంట్‌ మార్చ్‌ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు చర్యలకు వ్యతిరేకంగా సభలో ప్రతిపక్షాలు నిరసనలు తెలియజేస్తుండగా, ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లును ఆమోదించారు. హోంమంత్రి అమిత్‌ షా సభకు హాజరుకావాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు కొందరు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేస్తుండగా, బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. జనన మరణాల నమోదు చట్టం–1969లో పలు సవరణలు చేస్తూ ఈ బిల్లును రూపొందించారు. జననం లేదా మరణం జరిగిన రెండు సంవత్సరాల తర్వాత చేసే రిజిస్ట్రేషన్లకు జ్యుడీíÙయల్‌ మేజిస్ట్రేట్‌(మొదటి తరగతి) నుంచి ఉత్తర్వును తప్పనిసరి చేయడం ద్వారా జనన మరణాల ఆలస్య రిజిస్ట్రేషన్‌ను మరింత కఠినతరం చేయాలని ఈ బిల్లు సూచిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement