మారని తీరు..సాగని సభలు  | Both Houses adjourned for the day without any transaction | Sakshi
Sakshi News home page

మారని తీరు..సాగని సభలు 

Jul 25 2026 6:04 AM | Updated on Jul 25 2026 6:04 AM

Both Houses adjourned for the day without any transaction

పార్లమెంట్‌ ఉభయసభల్లో కొనసాగిన ప్రతిష్టంభన 

పేపర్‌ లీక్‌లపై చర్చించండి..

సమాధానమిస్తామన్న కేంద్రం 

ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టిన విపక్షం 

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు వరుసగా ఐదో రోజూ ఉభయసభల ప్రతిష్ఠంభనతోనే ముగిశాయి. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంపై వెంటనే చర్చ చేపట్టాలని, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్‌ సహా ఇండియా కూటమి సభ్యులు పట్టుబట్టడంతో లోక్‌సభ, రాజ్యసభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. పేపర్‌ లీక్‌పై ప్రభుత్వం చర్చకు సిద్ధమని ప్రకటించినా, ముందుగా ప్రధాన్‌ను తొలగించాల్సిందేనంటూ ప్రతిపక్షం పట్టుబట్టింది. విపక్ష ఎంపీల ఆందోళనలతో పలుమార్లు వాయిదా పడింది. ఉభయసభలను చివరకు సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. 

చర్చను అడ్డుకుంటుంది మీరే: కిరణ్‌ రిజిజు 
లోక్‌సభ శుక్రవారం తొలి వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభం అయ్యాక సైతం విపక్షాలు ప్రధాన్‌ రాజీనామాకు పట్టుబడుతూ నినాదాలతో సభను హోరెత్తించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు దీనిపై స్పందిస్తూ.. ప్రభుత్వం మొదటి నుంచీ నీట్‌ అంశంపై చర్చకు సిద్ధంగా ఉందని, ప్రతిపక్షమే షరతులు విధిస్తూ సభను నడవనివ్వడం లేదని విమర్శించారు.

 ప్రధాని మోదీ ఇప్పటికే నీట్‌ విషయంలో దేశానికి హామీ ఇచ్చారని, నీట్‌లో జరిగిన అవకతవకలు, ప్రశ్న పత్రం లీక్‌లను అరికట్టేందుకు కఠిన చట్టం తీసుకొస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పేరును నేరుగా ప్రస్తావిస్తూ, ‘మీరు మీ పార్టీ సభ్యులను ఒప్పించండి. సభను అడ్డుకోవడం మాని దేశ యువతకు సంబంధించిన ఈ కీలక అంశంపై చర్చ జరగనివ్వండి. పార్లమెంట్‌ సమయాన్ని వృథా చేయొద్దు’అని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ విపక్ష ఎంపీల నిరసనలు సద్దుమణగలేదు. ప్రతిపక్ష సభ్యులు ‘విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి’అంటూ నినాదాలు కొనసాగించడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు 

రాజ్యసభలో వందేమాతరం బిల్లు.. 
రాజ్యసభలోనూ విపక్షాలు నిరసనలు కొనసాగాయి. పేపర్‌లీకేజీ డిమాండ్‌తో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడం, మంత్రి ప్రధాన్‌ రాజీనామా చేయకపోవడంపై ప్రతిపక్ష నేత ఖర్గే ప్రస్తావించిన కొద్దిసేపటికే తీవ్ర గందరగోళం నెలకొని, సభ వాయిదా పడింది. మధ్యాహ్నం తర్వాత రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక (సవరణ) బిల్లు–2026‘ను ప్రవేశపెట్టారు. 

జనగణమనతో సమానంగా వందే మాతర గీతానికి చట్టపరమైన రక్షణ కల్పించడమే ఈ బిల్లు ఉద్దేశమని తెలిపారు. అయితే ఈ బిల్లును సీపీఎం తీవ్రంగా వ్యతిరేకించింది. సీపీఐ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ విద్యార్థుల ఉద్యమం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారని విమర్శించారు. అనంతరం ప్రతిపక్ష నిరసనలు కొనసాగడంతో రాజ్యసభను సోమవారానికి వాయిదా వేశారు.

ప్రధాన్‌ తొలగింపే మొదటి షరతు: రాహుల్‌ 
మంత్రి రిజిజు ప్రకటన అనంతరం పార్లమెంట్‌ వెలుపల రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించకపోతే ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. ‘విద్యార్థుల డిమాండ్లు మూడున్నాయి. అవినీతిపరుడైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించడం. విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవడం. ప్రధానమంత్రి విద్యార్థులకు క్షమాపణ చెప్పడం... ఈ మూడు డిమాండ్లు నెరవేర్చకుండా ఎలాంటి చర్చ జరగదు’అని తేల్చి చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement