-
లీకు వీరులకు బ్రేక్!
దశాబ్దాలుగా దాదాపు దేశవ్యాప్త జాడ్యంగా వున్న సమస్యకు సమగ్ర పరిష్కారం కోసం తొలి అడుగు పడింది. పోటీపరీక్షల్లో ప్రశ్నపత్రాన్ని లీక్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకొనే బిల్లును పార్లమెంటు ఆమోదించింది. నేరగాళ్లని తేలితే రూ. కోటి వరకూ జరిమానా, అయిదేళ్ల వరకూ శిక్ష ఉంటాయని బిల్లు చెబుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లీకుల్ని అరికట్టేందుకు చట్టాలున్నాయి. అయితే వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉన్నట్టులేదు. కేంద్రం తెచ్చిన చట్టం దాని పరిధిలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎన్టీఏ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్,నీట్, జేఈఈ తదితర పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి వర్తిస్తుంది. ఈ నమూనాలో రాష్ట్రాలు కూడా చట్టాలు చేయాలని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ చేసిన సూచన మంచిదే. పోటీ పరీక్షల చుట్టూ వేలాదికోట్ల వ్యాపారం నడుస్తోంది. ఒకప్పుడు ప్రధాన నగరాలు కొన్నిటిలో తర్ఫీదిచ్చే సంస్థలు కొలువుదీరేవి. అక్కడ వేలకు వేలు ఖర్చుపెట్టిన లక్షలాదిమంది విద్యార్థులు దర్శనమిచ్చేవారు. ఈమధ్య ఇది చిన్న నగరాలకూ, పట్టణాలకూ కూడా పాకింది. సివిల్ సర్వీసులు మొదలుకొని రాష్ట్రాల్లోని సర్వీసు కమిషన్లు, ప్రభుత్వరంగ సంస్థలు, ఆర్మీ, పోలీసు విభాగాలు నిర్వహించే పరీక్షల కోసం పల్లెసీమల నుంచి సైతం వేలమంది తరలివస్తున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగాలు సాధిస్తే జీవితాంతం చీకూ చింతా లేకుండా బతికేయొచ్చని నిరుద్యోగులు కలలు కంటున్నారు. కానీ ప్రశ్నపత్రాలతో వందలకోట్లు దండు కునే ముఠాలు ఈ కలల్ని కొల్లగొడుతున్నాయి. ప్రభుత్వోద్యోగాల భర్తీని ప్రహసన ప్రాయం చేస్తున్నాయి. విజేతలవుతున్నవారిలో ఎవరు సచ్ఛీలురో, ఎవరు కాదో తెలియని అయోమయ స్థితి ఏర్పడుతోంది. పోటీ పరీక్షల్లో అక్రమాలను అరికట్టే అంశంపై 90వ దశకంనుంచి ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టి పెట్టడం మొదలెట్టాయి. కానీ అవి ఆగిన జాడ లేదు. ఐఐటీ జేఈఈ ప్రశ్నపత్రాలు లీకయినట్టు తొలిసారి 1997లో మీడియాలో కథనాలొచ్చాయి. లక్నోలోని ఒక సంస్థ ఆ ఏడాది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ పరీక్షలకు 12 గంటల ముందు తమ విద్యార్థులకు ఆ ప్రశ్నలు అందించినట్టు ఆ కథనాలు తెలిపాయి. ‘ఆఖరి నిమిషం టిప్స్’ ప్రోగ్రాం మాటున తమ దగ్గరున్న 700 మందిలో వందమంది విద్యార్థుల దగ్గర అదనంగా సొమ్ము వసూలు చేసి వారిచేత బట్టీపట్టించిన వైనం అప్పట్లో సంచలనం కలిగించింది. మొదటిరోజున ఒక విద్యార్థి తండ్రి జేఈఈ చైర్మన్కు ఈ సంగతి ఫిర్యాదుచేసినా కుమారుడి వైఫల్యంపై వేదనతో ఆధారం లేని ఆరోపణ చేశారని ఆయన కొట్టిపారేశారు. తమ నిర్వాకంపై ఆయనకు అంత నమ్మకం మరి! కానీ మరుసటి రోజు మ్యాథ్స్ పేపర్ను ఫాక్స్ చేశాక ఆయనకు తత్వం బోధపడింది. కావాలని అక్కడక్కడ చేసిన కొద్దిపాటి మార్పులు మినహా అది తమ ప్రశ్నపత్రాన్నే పోలివుందని గ్రహించి చివరి నిమిషంలో ఆ పరీక్షను రద్దుచేశారు. ఆ లీకేజీకి అప్పటి కాన్పూర్ ఐఐటీ డైరెక్టర్కు వున్న పుత్రప్రేమే కారణమని కథనాలొచ్చాయి. ఆ ఏడాది రూర్కీ ఇంజనీరింగ్ కళాశాల ప్రవేశపరీక్షపై సైతం ఇలాంటి కథనాలే వెలువడినా అది రద్దు కాలేదు. ప్రశ్నపత్రాలు కైంకర్యం చేసి కోట్లాది రూపాయలు వెనకేస్తున్న మాఫియాతోపాటు కొన్ని సందర్భాల్లో ఉన్నతస్థాయి వ్యక్తులకుండే స్వప్రయోజనాలు, అవతలివారిని రాజకీయంగా దెబ్బతీసే ఉద్దేశాలు కూడా ఈ లీకులకు కారణమైన ఉదంతాలు లేకపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ కేబినెట్లో పాఠశాల విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన గాలి ముద్దు కృష్ణమనాయుడు అప్పట్లో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకుకు నైతిక బాధ్యతవహిస్తూ తప్పుకున్నారు. చిత్తూరు జిల్లాలో తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు పార్టీ ప్రముఖ నాయకుడే ఈ లీకేజ్కి ఒడిగట్టారని ఆయన ఆరోపించటం ఎవరూ మరిచిపోరు. ప్రశ్నపత్రాలు సంపాదించే ఉద్యోగార్థుల్లో కొందరు గప్చిప్గా ఉండక సొమ్ము చేసుకోవాలని కక్కుర్తిపడిన సందర్భాల్లో లేదా తమ సన్నిహితులకు అందజేసినప్పుడు మీడియాకు వెల్లడై చాలాసార్లు చౌర్యం బయటపడుతుంటుంది. ఇలాంటివేమీ లేనప్పుడు అంతా సజావుగా సాగిపోతుంది. నిజాయితీపరులైన ఉద్యోగార్థులను లీకేజీ దెబ్బతీస్తుంది. ప్రపంచ దేశాల్లో మనం నవ్వుల పాలవుతాం. గత అయిదేళ్లలో 15 రాష్ట్రాల్లో లక్షా నాలుగువేల ఉద్యోగాల భర్తీకోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయనీ, ఇందువల్ల కోటి 40 లక్షలమంది ఉద్యోగార్థుల భవి ష్యత్తు దెబ్బతిందనీ ఒక ఆంగ్ల దినపత్రిక కథనం. ఈ లీకుల పర్యవసానంగా పరీక్ష రద్దు చేసినా, నిరవధిక వాయిదా వేసినా, పట్టించుకోకుండా వదిలేసినా దెబ్బతినేది నిరుద్యోగులే. నిరుడు తెలంగాణ, రాజస్థాన్లలో ప్రశ్నపత్రాల లీకు నిరుద్యోగ ప్రపంచాన్ని ఎంత కలవరపరిచిందో ఎవరూ మరిచిపోరు. అయితే లీకులకు కొన్ని సంస్థలు, వ్యకులను మాత్రమే బాధ్యులుగా చేయడంతో సరి పెట్టక రాజకీయ నాయకులు, ఏజెంట్లు, పోటీ పరీక్షల విభాగాల్లోవుండే అవినీతి అధికారులు వగైరాలతో కూడిన మాఫియా ముఠాలున్నాయని గుర్తిస్తే తాజా చట్టం మరింత కఠినతరం చేయ టానికి అవకాశం వుంటుంది. లీకు సంగతి వెల్లడికాగానే రంగప్రవేశం చేసేలా ఈడీ, సీబీఐ తరహాలో ప్రత్యేక దర్యాప్తు సంస్థలను ఏర్పరచటంవల్ల బాధ్యులను గుర్తించటం వేగవంతమవుతుంది. ఈ కేసుల్లో నిందితుల విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు కూడా అవసరమే. ఇక లీకులవల్ల లబ్ధి పొందే ఉద్యోగార్థులను ఈ చట్టం పరిధినుంచి తప్పించటం ఎంతవరకూ సబబో ఆలోచించాలి. ఈ లీకుల లబ్ధిదారుల్లో సైతం భయభక్తులుంటేనే సమస్యను అరికట్టడం సాధ్యమవుతుంది. -
TS High Court: టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డిబార్ ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డిబార్ను తెలంగాణ హైకోర్టు ఎత్తివేసింది. కమలాపూర్ పరీక్ష కేంద్రంలో విద్యార్థి హరీష్ను డీఈవో డీబార్ చేసిన విషయం తెలిసిందే.. దీనిపై విద్యార్థి హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో పదో పరీక్షలు హరీష్ రాశాడు. హరీష్ పదో తరగతి ఫలితాలను అధికారులు హోల్డ్లో పెట్టారు. హరీష్పై డీబార్ ఉత్తర్వులు కొట్టివేస్తూ హైకోర్టు.. గురువారం తీర్పునిచ్చింది. హరీష్ రాసిన పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. వరంగల్ జిల్లాలోని కమలాపూర్ జడ్పీ బాలుర హైస్కూల్లో టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ అవ్వడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే టెన్త్ విద్యార్థి హరీష్ నుంచి పదో తరగతి ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు తేలడంతో విద్యార్థిని అధికారురలు డీబార్ చేశారు. తన కుమారుడు హరీష్ పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని తండ్రి హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడిని బెదిరించడంతోనే ప్రశ్నాపత్రం ఇతరులకు ఇచ్చాడని.. అదే వాట్సప్లో వచ్చిందన్నారు. తన కుమారుడిని పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు హరీష్ను పదో తరగతి పరీక్ష రాసేందుకు అనుమతించింది. తర్వాత ఫలితాలు విడుదల సమయంలో హరీష్ ఫలితాలను వెల్లడించకుండా హోల్డ్లో పెట్టారు. దీంతో మరోసారి విద్యార్థి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. విద్యార్థిపై ఉన్న డీబార్ను కొట్టివేస్తూ.. తక్షణమే ఫలితాలు వెల్లడించాలంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది. చదవండి: ఎవరిది తప్పు.. ఎవరికి ముప్పు ? -
టీఎస్పీఎస్సీ ఉద్యోగులు పరీక్ష ఎలా రాస్తారు?
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్పీ) ఉద్యోగులు అది నిర్వహించే పరీక్షలు ఎలా రాస్తారు. వారిని పరీక్షపత్రాల తయారీకి ఎలా అనుమతిస్తారు?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల ప్రశ్నపత్రం లీకేజీపై హైకోర్టుకు మంగళవారం సిట్ దర్యాప్తు స్థాయీ నివేదిక సీల్డ్ కవర్లో సమర్పించింది. అయితే నిందితుల వివరాలను ఇవ్వాలని సర్కార్కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. పేపర్ లీకేజీ కేసును సిట్ పారదర్శకంగా దర్యాప్తు చేయలేదని, సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్తోపాటు మరో ఇద్దరు నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ నివేదిక అందజేసి వాదనలు వినిపించారు. దర్యాప్తు నివేదికను పిటిషనర్లకు ఇవ్వాలని, వారి తరఫు సీనియర్ న్యాయవాది వివేక్ ఠంకా న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. సీల్డ్ కవర్ నివేదికలను బహిర్గతం చేయవచ్చని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో పేర్కొందని ఠంకా చెప్పారు. దర్యాప్తులో తీవ్ర లోపాలున్నాయని, సాక్ష్యాలు మాయమవుతున్నాయని అన్నారు. సిట్ చైర్మన్పై ఆరోపణలు ఉన్నాయని, సరీ్వస్ కమిషన్ ఏర్పాటులోనూ లోపాలున్నాయని పేర్కొన్నారు. ఈ కేసులో ప్రవాస భారతీయుల పాత్ర ఉందన్నారు. ఇది 30 లక్షల మంది భవిష్యత్తో ముడిపడి ఉన్న అంశమని అన్నారు. సెక్షన్ అధికారి వద్ద మాత్రమే కాకుండా చైర్మన్, కార్యదర్శి వద్ద కూడా పాస్వర్డ్ ఉంటుందన్నారు. పారదర్శకంగా సాగని దర్యాప్తు సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగడంలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వివేక్ ఠంకా అన్నారు. ఈ క్రమంలో ప్రశ్నపత్రాలను ఎవరు తయారీ చేశారు.. ఏ ఏజెన్సీకి అప్పగించారు.. అని న్యాయమూర్తి ప్రశ్నించారు. పరీక్షలు రాసేవారిని విధులకు ఎందుకు అనుమతించారని అడుగగా, పరీక్షలు రాసేవారిని నిర్వహణ ప్రక్రియకు దూరంగా పెట్టినట్లు ఏజీ చెప్పారు. దర్యాప్తు పురోగతిపై పూర్తి వివరాలతో నివేదికను సమరి్పస్తామని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులతోపాటు మరికొన్ని వివరాలు అందాల్సి ఉందన్నారు. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులుండగా, 17 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఒకరు మాత్రం న్యూజిలాండ్లో ఉన్నారని అన్నారు. సీబీఐ దర్యాప్తు అవసరం లేదని నివేదించారు. ఏ ఒక్కరూ చట్టం నుంచి తప్పించుకోలేరని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేశారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ -
నిర్లక్ష్యం ఫలితమేనా?
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షల విషయంలో పాఠశాల విద్యాశాఖ డొల్లతనం అడుగడుగున బయటపడుతోంది. ఈ శాఖ నిర్లక్ష్య వైఖరే సమస్యకు కారణమనే వాదన బలపడుతోంది. తెలుగు, హిందీ పేపర్ లీక్ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేసింది. పరీక్షల నిబంధనలు, విద్యాశాఖ తీసుకున్న జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరును ఇంటెలిజెన్స్ ఆ నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. పరీక్షల సందర్భంగా ఉండే సాధారణ నిబంధనలను క్షేత్రస్థాయికి పంపడం మినహా, ఎక్కడ, ఎలాంటి లోపాలున్నాయో వాకబు చేయడం, దానికి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లాంటివేమీ చేపట్టలేని నిఘా వర్గాల పరిశీలనలో తేలినట్లు తెలుస్తోంది. ఈ నివేదికపై సీఎస్ తాజాగా విద్యాశాఖ ఉన్నతాధికారుల వివరణ కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అంతటా వైఫల్యమే.. హనుమకొండ జిల్లాలో స్కూల్ అవరణలోకి వేరే వ్యక్తి వచ్చి ఫోటోలు తీసే అవకాశం ఉన్న పరిస్థితిని గుర్తించకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందని అంటున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమలులో ఉంటుంది. పోలీసు పహారా కూడా ఉంటుంది. అయినప్పటికీ పరీక్ష కేంద్రం సమీపంలోకి ఇతరులు రావడం భద్రత వైఫల్యానికి అద్దంపడుతోంది. పరీక్షా కేంద్రానికి సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలనే ఆదేశాలున్నాయి. కానీ వరంగల్ ఘటనలో ప్రశ్నపత్రాన్ని జిరాక్స్ తీసినట్టు పోలీసు వర్గాల విచారణలో తేలింది. మరోవైపు వికారాబాద్ జిల్లాలో ఇన్విజిలేటర్ సెల్ఫోన్ తీసుకుని వెళ్ళినా, పై అధికారులు గుర్తించకపోవడం, సీసీ కెమెరాలున్నా నిష్ప్రయోజనంగా మారడం వైఫల్యాలకు అద్దం పడుతోంది. కొన్నేళ్ళుగా నడుస్తోందా? టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అనేక కొత్త అంశాలను ఇంటెలిజెన్స్ నివేదిక ప్రస్తావించినట్టు తెలిసింది. లీకేజీకి పాల్పడిన టీచర్లకు గతంలో నేర చరిత్ర ఉండటాన్ని ఎత్తి చూపినట్లు చెబుతున్నారు. తాండూరులో ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా పంపిన బందెప్పపై గతంలోనే పోక్సో కేసు నమోదయ్యింది. ఇలాంటి టీచర్ల ప్రతి రిమార్క్ కంప్యూటర్లో నిక్షిప్తమవుతుంది. టీచర్ల సర్విస్ రికార్డును పరిశీలించిన తర్వాతే విద్యాశాఖ కీలకమైన బాధ్యతల్లోకి తీసుకుంటుంది. పరీక్షల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కానీ బందెప్ప విషయంలో దీన్ని విస్మరించడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనం. కాగా లీకేజీల వ్యవహారం కొన్నేళ్ళుగా నడుస్తోందా? అనే అనుమానాలకు కూడా ఇది తావిస్తోందని అంటున్నారు. కాగా ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో ప్రభుత్వానికి ఏం సమాధానం చెప్పాలనే దానిపై పాఠశాల విద్య వర్గాలు తర్జన భర్జన పడుతున్నాయి. -
టెన్త్ పేపర్ లీక్ పెద్ద గేమ్ప్లాన్
సాక్షిప్రతినిధి, వరంగల్/వరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా కమలాపూర్లో హిందీ ప్రశ్నపత్రం లీక్, కాపీ కుట్ర పెద్ద గేమ్ప్లాన్ అని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన రేపి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కుట్రకు పాల్పడ్డారని తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బండి సంజయ్ది ప్రధాన పాత్ర అని తేలడంతోనే ప్రథమ నిందితుడిగా చేర్చామన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, కొత్త అంశాలు బయటికొస్తే సెక్షన్లు మారుతాయని వివరించారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సీపీ ఏవీ రంగనాథ్ వివరాలను వెల్లడించారు. ఈ కేసులో 10 మందిని నిందితులుగా చేర్చామని.. ఏ1 బండి సంజయ్, ఏ2 బూర ప్రశాంత్, ఏ3 గుండెబోయిన మహేశ్, ఏ5 మౌటం శివగణేశ్లను అరెస్టు చేశామని, ఏ4గా ఉన్న బాలుడిని జువైనల్ హోమ్కు తరలించామని తెలిపారు. పరీక్షల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్వి జిలేటర్లపై విద్యాశాఖ చర్యలు తీసుకుందని చెప్పారు. సంజయ్ ఆదేశాలతోనే లీక్ ఈ కేసులో నిందితుడైన బూర ప్రశాంత్ జర్నలిస్ట్ కాదని, చాలా మందికి వాట్సాప్లో ప్రశ్నపత్రాన్ని పంపించాడని.. బండి సంజయ్ ఆదేశాల మేరకే ప్రశాంత్ కుట్రలో భాగస్వామి అయ్యాడని విచారణలో తేలిందని సీపీ వెల్లడించారు. ‘‘రెండు రోజుల క్రితం సాయంత్రం బండి సంజయ్తో ప్రశాంత్ వాట్సాప్ చాటింగ్ చేశాడు. ప్రశాంత్ చాటింగ్లో పేర్కొన్న అంశాలనే బండి సంజయ్ ప్రెస్మీట్లో మాట్లాడాడు. తర్వాతిరోజు బండి సంజయ్తో ప్రశాంత్ వాట్సాప్ కాల్ మాట్లాడాడు. దీనికి సంబంధించి 76800 06600 నంబర్తో కూడిన ఫోన్ ఇవ్వాలని అడిగినా బండి సంజయ్ ఇవ్వలేదు. ఆ ఫోన్ ఇస్తే మాకు కీలక సమాచారం వస్తుంది’’ అని సీపీ వెల్లడించారు. ఇంకా కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ల వివరాలు రావాల్సి ఉందని చెప్పారు. ప్రశాంత్పై కేవలం మెసేజ్ షేర్ చేసినందుకు మాత్రమే కేసు బుక్ చేయలేదని.. బీజేపీ మానిటరింగ్ చేస్తున్న నమో టీంలో వరంగల్ లోక్సభ పరిధిలో ప్రశాంత్ పనిచేస్తున్నాడని తెలిపారు. ప్రశాంత్ ఈ హిందీ పేపర్ను ఈటెల రాజేందర్, ఆయన పీఏ నరేందర్లతోపాటు పలువురు బీజేపీ నేతలకు పంపాడని చెప్పారు. చట్టప్రకారమే అరెస్టులు బండి సంజయ్ అరెస్టు చట్టప్రకారమే జరిగిందని, 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేయొచ్చని, దీనికి తగిన కారణాలున్నాయని సీపీ రంగనాథ్ వివరించారు. సంజయ్ అరెస్టుకు ముందు లోక్సభ స్పీకర్కు సమాచారం ఇచ్చామని చెప్పారు. తమపై ఎవరి ఒత్తిళ్లు లేవని, వరంగల్లో ఎక్కువగా అరెస్ట్ చేసింది బీఆర్ఎస్ వారినేనని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను అరెస్టు చేయడంపై జాతీయ మహిళా కమిషన్ అడుగుతున్న ప్రశ్నలకు కూడా చట్టపరిధిలో సమాధానం ఇస్తామన్నారు. ఈ కేసులో నేరం రుజువైతే సంజయ్, ఇతర నిందితులకు మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్షపడే అవకాశం ఉందన్నారు. రిమాండ్ రిపోర్టు: అరెస్టులకు కారణాలివీ.. హిందీ పేపర్ లీక్ కేసులో మొత్తం 10 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు.. బండి సంజయ్ సహా నలుగురి అరెస్టుకు కారణాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అర్ణేష్ కుమార్ వర్సెస్ బీహార్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన నియమాలకు లోబడి.. నోటీసులు ఇవ్వకుండా నేరుగా నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు పేర్కొన్నారు. ఆ అంశాలు, కారణాలివీ.. ♦ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు పరీక్ష కేంద్రం నుంచి హిందీ ప్రశ్నపత్రాన్ని తీసి, దాని ఫోటోలను వాట్సాప్/సోషల్ మీడి యాలో షేర్ చేయడం హేయమైన నేరం. ఇంకా పరీక్షల ప్రక్రియ కొనసాగుతోంది. నిందితులు రిమాండ్ కాకుంటే పరీక్షల నేరాలకు మరింతగా పాల్పడి.. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ను నాశనం చేసే అవకాశం ఉంది. ♦ నిందితులు రిమాండ్కు వెళ్లకుంటే.. రాష్ట్రంలోని చిత్తశుద్ధి గల విద్యార్థులు సీరియస్గా తీసుకుని, నిందితులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయతి్నస్తే.. అది శాంతిభద్రతల సమస్యకు దారితీయవచ్చు. ♦ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. చాలా సాక్ష్యాలను సేకరించాలి. నిందితులు బయట ఉంటే.. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు, తదుపరి దర్యాప్తు సరైన విధంగా జరగకుండా ఆటంకం కలిగించేందుకు అవకాశం ఉంది. ♦ ఇది చాలా తీవ్రమైన కేసు, ముందస్తు ప్రణాళికతో చేసిన నేరపూరిత కుట్ర. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశంతో చేశారు. మరికొందరు నేరస్తులను ఇంకా పట్టుకోవాల్సి ఉంది. లోతైన దర్యాప్తు అవసరం. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నిందితులను రిమాండ్కు పంపాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’.. కాంగ్రెస్పై ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
‘రైతుల భూ డాక్యుమెంట్లను బుగ్గిపాలు చేసింది బాబేగా!’
తప్పక చదవండి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’.. కాంగ్రెస్పై ప్రధాని మోదీ విమర్శలు
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement