కోల్కతా: కోల్కతాలోని అలీపూర్ జులాజికల్ గార్డెన్లో మాంసాహార జంతువులకు సంబంధించి ఒక విచిత్రమైన సమస్య తలెత్తింది. మున్సిపల్ వధశాలలో గేదెల వధ నిలిచిపోవడంతో.. పులులు, సింహాలు, తోడేళ్లకు ప్రత్యామ్నాయంగా మేక మాంసాన్ని అందిస్తున్నారు. ఫలితంగా జంతుప్రదర్శనశాల ఆహార ఖర్చులు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాంగ్రాలోని కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) ఆధ్వర్యంలోని కబేళాలో గేదెలు, ఇతర బోవిన్ జంతువుల వధ నిలిచిపోయింది. జూకు మాంసం సరఫరా చేసే వ్యాపారులకు పౌర సంస్థ లైసెన్సులు పునరుద్ధరించకపోవడమే ఇందుకు కారణమని వారు ఆరోపిస్తున్నారు. దీంతో అనివార్యంగా చాలా ఖరీదైన మేక మాంసాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.
గతంలో జూలోని ఎనిమిది పులులు, జత బూడిద రంగు తోడేళ్లు, ఒక జత ఆసియా సింహాలకు గేదె మాంసాన్ని ఆహారంగా పెట్టేవారు. సమస్య పరిష్కారం కోసం మాంసం సరఫరాదారులు అటవీశాఖ మంత్రి మనోజ్ కుమార్ ఓరాన్ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కేఎంసీ అధికారులతో చర్చించి, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు జూ అధికారి తెలిపారు.
అయితే సమస్య పరిష్కారమయ్యే వరకు జంతువులకు నాణ్యత, పరిమాణంలో ఎలాంటి కోత విధించకుండా మేక మాంసమే సరఫరా చేయనున్నట్లు స్పష్టం చేశారు. జూ వార్షిక అవసరాల కోసం సుమారు 51,000 కిలోల గేదె మాంసం అవసరమవుతుంది. కేజీ ఎముకలు లేని గేదె మాంసం సుమారు రూ. 350 ఉండగా, మేక మాంసం ధర మాత్రం కేజీ రూ. 728 వరకు ఉంది. ధరల్లో ఈ భారీ వ్యత్యాసం కారణంగా జూపై ఆర్థిక భారం విపరీతంగా పెరిగింది. కోల్కతాలో మేక, గొర్రె మాంసానికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో సరఫరాలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పెద్ద మాంసాహార జంతువులు గేదె మాంసాన్ని ఇష్టపడతాయని, చికెన్ను కూడా ముట్టవని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: పాక్ పైశాచికం: ‘పీఓకే’ చూపించారని ‘అల్ జజీరా’ బంద్!


