source: X
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానికంగా జరిగిన ఓ వన్డే మ్యాచ్లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అమృత్సర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ తరన్ తారన్ మెన్స్ సీనియర్ జట్టుపై 91 బంతుల్లో 233 పరుగులతో చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 25 సిక్సర్లు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉంటే, అభిషేక్ ఇటీవలికాలంలో టీమిండియా తరఫున వరుసగా విఫలమయ్యాడు. గత ఏడు టీ20 మ్యాచ్ల్లో అతడు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. చివరిగా ఇంగ్లండ్ పర్యటనలో తొలి మ్యాచ్లో అర్ద సెంచరీ చేశాడు. దానికి ముందు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయలేదు. అతడు చివరి సారిగా మూడంకెల స్కోర్ చేసింది ఐపీఎల్ 2026లో. డీసీతో జరిగిన మ్యాచ్లో అతడు 68 బంతుల్లో అజేయమైన 135 పరుగులు చేశాడు.
తాజాగా జింబాబ్వేతో ముగిసిన 3 మ్యాచ్ల సిరీస్లో అభిషేక్ ఫామ్ ఘోరంగా పడిపోయింది. ఆ మూడు మ్యాచ్ల్లో అతడు వరుసగా 1, 8, 2 స్కోర్లు చేశాడు. ఈ సిరీస్లో అభిషేక్ కనీసం రెండంకెల స్కోర్ను కూడా చేయలేకపోయాడు. ప్రస్తుతం భారత జట్టు ఖాళీగా ఉండటంతో స్థానిక వన్డే మ్యాచ్ ఆడిన అభిషేక్ ఎట్టకేలకు ఫామ్ దొరకబుచ్చుకున్నాడు.
త్వరలో టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుండగా, ఆ పర్యటన నిమిత్తం ఎంపిక చేసిన టెస్ట్ జట్టులో అభిషేక్కు చోటు దక్కలేదు. అభిషేక్కు గతకొంతకాలంగా టీ20ల్లో మాత్రమే అవకాశం వస్తుంది. తాజా ప్రదర్శనతో అతడు వన్డే జట్టులో స్థానంపై కూడా కన్నేయవచ్చు. టీమిండియా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నిమిత్తం ఆగస్ట్ 4న శ్రీలంక పర్యటనకు బయల్దేరనుంది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ మ్యాచ్ గాలే వేదికగా ఆగస్ట్ 15న ప్రారంభం కానుంది. దీనికి ముందు భారత జట్టు ఓ వార్మప్ మ్యాచ్ ఆడనుంది.


