ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాక్రే ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయంపై సంచలన ఆరోపణలు చేశారు. ఆలయంలో ఏటా సుమారు రూ. 18 కోట్ల విరాళాలు పక్కదారి పడుతున్నాయని, ఈ కుంభకోణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంఎన్ఎస్ విద్యార్థి విభాగం నిర్వహించిన కార్యక్రమంలో రాజ్ థాక్రే మాట్లాడుతూ.. పూజా మందిరాలు కూడా అవినీతికి అతీతం కాకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సిద్ధివినాయక ఆలయంలోని హుండీలో ఉద్యోగులే డబ్బులు దొంగిలిస్తున్నారని, ట్రస్టీల అప్రమత్తత వల్లే కొందరు దొరికిపోయారని తెలిపారు. ఆలయ ట్రస్టీలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు రాసిన లేఖను ఉటంకిస్తూ.. ఈ దొంగతనాలు వెలుగుచూశాక వారంవారీ విరాళాల సేకరణ భారీగా పెరిగినట్లు ఆయన చెప్పారు. దొంగతనాలు బయటపడకముందు వారానికి రూ. 50 లక్షల కంటే తక్కువగా ఉన్న విరాళాలు, ఆ తర్వాత రూ. 1.5 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఈ గణాంకాల ఆధారంగానే ఏటా సుమారు రూ. 18 కోట్లు స్వాహా అవుతున్నాయని ఆరోపించారు. ఇదే సమయంలో అయోధ్య రామమందిరంలోనూ రూ. 1,400 కోట్ల విరాళాలు చోరీకి గురయ్యాయని ఆయన ఆరోపించారు.
రాజ్ థాక్రే ఆరోపణలపై సిద్ధివినాయక టెంపుల్ ట్రస్ట్ ఛైర్మన్, శివసేన నేత సదా సర్వంకర్ స్పందించారు. విరాళాల చోరీకి సంబంధించి ఇప్పటికే తొమ్మిది మంది ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఎక్కడ అవసరమైతే అక్కడ కేసులు నమోదు చేశామని చెప్పారు. ఆలయ పరిపాలనను మెరుగుపరచడం వల్లే విరాళాలు పెరిగాయని, రెండేళ్ల క్రితం రూ. 114 కోట్లుగా ఉన్న ఆలయ వార్షిక ఆదాయం ఇప్పుడు రూ. 182 కోట్లకు చేరిందని సర్వంకర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Friendship Day: ముగ్గురు మిత్రులు.. ఇప్పుడు ఐఎఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్!


