‘కార్తికేయ’ నటుడి వ్యాఖ్యలపై మాజీ సీఎం ఫైర్‌! | Anupam Kher Shares Cryptic Post After Ram Mandir Donation Theft Controversy | Sakshi
Sakshi News home page

‘కార్తికేయ’ నటుడి వ్యాఖ్యలపై మాజీ సీఎం ఫైర్‌!

Jul 13 2026 12:21 PM | Updated on Jul 13 2026 12:35 PM

Anupam Kher Shares Cryptic Post After Ram Mandir Donation Theft Controversy

న్యూఢిల్లీ: అయోధ్య రామాలయం విరాళాల చోరీ వివాదంపై బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఆయన ‘ఎక్స్‌’ వేదికగా పరోక్షంగా ఒక ఆసక్తికరమైన సందేశాన్ని పంచుకున్నారు.

‘నా సమాధానం ఒక్కటే..’
తాజా పోస్టులో అనుపమ్ ఖేర్ .. ‘కొన్ని అంశాలపై నేను ఇంత నిర్భయంగా ఎలా మాట్లాడగలుగుతున్నానని, నా జనాదరణ తగ్గిపోతుందనే భయం నాకు లేదా అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. దానికి నా సమాధానం ఒక్కటే.. నేను ప్రతి ఒక్కరినీ సంతోష పెట్టడానికి ప్రయత్నించను. జీవితంలో అందరినీ సంతోషంగా ఉంచడం అత్యంత కష్టమైన పని. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఇష్టుడిగా మారిన వ్యక్తి ఎవరూ లేరు’ అని పేర్కొన్నారు.

అందరికీ ఇష్టమైన వారిగా మారాలని ప్రయత్నిస్తే, జనం తమ సౌకర్యాన్ని బట్టి మనల్ని వాడుకోవడం మొదలుపెడతారని ఆయన అన్నారు. ‘నా జీవితంలో ఒక సిద్ధాంతం ఉంది. ముందుగా మీకు మీరే ఇష్టులుగా మారండి. ప్రతిరోజూ ఉదయం అద్దంలో చూసుకున్నప్పుడు నేను మంచి వ్యక్తినే అని మీకు అనిపించాలి. ఒకవేళ ఏదైనా తప్పుగా అనిపిస్తే మార్చుకోండి. ఆ మార్పు మీ కోసమే కావాలి.. ప్రపంచం కోసం కాదు. మీ గురించి అత్యుత్తమమైన విషయం మీరే. మీ తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఆప్తమిత్రులు మిమ్మల్ని ప్రేమిస్తే, మీకు ఇప్పటికే ప్రజాదరణ పత్రం లభించినట్లే. మిగిలిన విషయాలేవీ ముఖ్యం కాదు’ అని ఖేర్ రాసుకొచ్చారు.

అసలు వివాదం ఏంటి?
అయోధ్య రామాలయ విరాళాల నిధుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. ఈ వివాదంపై అనుపమ్ ఖేర్ తన రాబోయే చిత్రం 'శ్రీరామ భూమి' ప్రమోషన్ల కోసం అయోధ్యను సందర్శించినప్పుడు స్పందించారు. ఈ నిధుల దుర్వినియోగాన్ని ఒక ‘చిన్న సమస్య’ లేదా ‘చిన్న పొరపాటు’ గా అభివర్ణిస్తూ.. గతంలో మొఘలుల కాలంలో హిందూ దేవాలయాలను లూటీ చేసిన, ధ్వంసం చేసిన చారిత్రక ఉదంతాలతో దీనిని పోల్చారు. కేవలం ఈ ఒక్క ఘటన ఆధారంగా ఆలయాన్ని లేదా సనాతన ధర్మాన్ని నిందించవద్దని, దొంగతనం చేసిన వారిని మాత్రమే నిందించాలని ఆయన కోరారు.

రాజకీయ దుమారం
ఈ పోలికపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడమే కాకుండా, సమాజ్ వాదీ పార్టీ (ఎస్‌పీ)అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ‘దొంగను ఏమీ అనకూడదంటూ, దొంగతనాన్ని బట్టబయలు చేసిన వారికి  హితబోధలు చేయడం విచిత్రమైన వాదన అని అన్నారు. దొంగలపై ఇంత సానుభూతి చూపించడం వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది’ అని అనుపమ్‌ ఖేర్‌ను ఉద్దేశిస్తూ అఖిలేష్‌ విమర్శించారు. బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ తెలుగులో ‘కారికేయ-2’లో కీలక పాత్ర పోషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement