వాషింగ్టన్: అమెరికాలోని ప్రముఖ బ్రౌన్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి అక్రమంగా పరీక్షలు రాసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వెల్ఫేర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ ఛాయిస్ థియరీ కోర్సు ప్రొఫెసర్ రాబర్టో సెరానో ఇటీవల క్యాంపస్లో జరిగిన ఒక కాల్పుల ఘటనను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులకు మిడ్టర్మ్ పరీక్షలను ఇంటి నుంచే రాసేందుకు అనుమతించారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పరీక్షలో విద్యార్థులు ఏకంగా 96 శాతం సగటు మార్కులు సాధించడం ప్రొఫెసర్కు అనుమానం కలిగించింది. గతంలో ఈ కోర్సు సగటు మార్కులు 65 నుంచి 80 శాతం లోపు మాత్రమే ఉండేవి.
విద్యార్థుల సమాధానాల శైలి సంక్లిష్టంగా ఉండటం, చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్ వాడినట్లు అనిపించడంతో ఆయన అప్రమత్తమయ్యారు. దీనిపై విద్యార్థులను హెచ్చరిస్తూ, ఫైనల్ పరీక్షలను తరగతి గదిలోనే నిర్వహిస్తామని, మిడ్టర్మ్ మార్కులకు దగ్గరగా వస్తేనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో భయపడిన 18 మంది విద్యార్థులు కోర్సు నుండి తప్పుకోగా, మరో తొమ్మిది మంది పరీక్షకు హాజరుకాలేదు. మిగిలిన 59 మంది విద్యార్థులకు క్లాస్రూమ్లో ఫైనల్ పరీక్ష నిర్వహించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అందులో ముగ్గురు విద్యార్థులకు సున్నా మార్కులు రాగా, కేవలం ఇద్దరు మాత్రమే మిడ్టర్మ్ మార్కులకు దరిదాపుల్లో స్కోరు చేయగలిగారు. విద్యార్థులు ఇలా మోసాలకు పాల్పడటం వారి భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తోందని ప్రొఫెసర్ సెరానో విచారం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: అర నిమిషంలో 195 ముద్దులు.. క్రేజీ లవర్స్ రికార్డ్!


