కాఠ్మాండు రణరంగం: అటు వరద ముంపు.. ఇటు అణచివేత! | Kathmandu A Battlefield Floods on One Side Crackdown on the Other | Sakshi
Sakshi News home page

కాఠ్మాండు రణరంగం: అటు వరద ముంపు.. ఇటు అణచివేత!

Jul 13 2026 9:35 AM | Updated on Jul 13 2026 9:35 AM

Kathmandu A Battlefield  Floods on One Side Crackdown on the Other

కాఠ్మాండు: నిలువ నీడ లేని నిరుపేదలను పునరావాసం కల్పించకుండానే బలవంతంగా వారిన ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారని, సామాజిక కార్యకర్తలపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నేపాల్‌లో వందలాది మంది యువతీ యువకులు మళ్లీ రోడ్లపైకి వచ్చారు. కాఠ్మాండులో నివాసాల ఖాళీ ప్రక్రియను నిరసిస్తూ, బాధిత నిరుపేదలకు న్యాయం చేయాలని, గృహ హక్కులను రక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ కార్యాలయం వెలుపల భారీ ఎత్తున బైఠాయించారు.

‘జాయింట్ నేషనల్ స్క్వాటర్స్ ఫ్రంట్’ ఆధ్వర్యంలో కాఠ్మాండులోని సింహదర్బార్ సెక్రటేరియట్ సమీపంలో ఉన్న మైతీఘర్ మండలా వద్ద ఈ నిరసన ప్రదర్శన జరిగింది. పేద కుటుంబాలను వేధించడం ఆపాలని, మానవ హక్కులను గౌరవించాలని, అక్రమ అరెస్టులను నిలిపివేయాలని, నిరాశ్రయులైన నిరుపేదలకు శాశ్వత గృహ వసతి కల్పించాలని నిరసనకారులు ప్లకార్డులతో డిమాండ్ చేశారు.

పోలీసుల చర్యలతో పెరిగిన ఉద్రిక్తతలు
శుక్రవారం రాత్రి కాఠ్మాండులోని కీర్తీపూర్ లో ఉన్న ఒక ప్రభుత్వ తాత్కాలిక పునరావాస కేంద్రం వరద ముంపునకు గురైంది. అక్కడ సుమారు 150 మంది నిరుపేదలు ఆశ్రయం పొందుతున్నారు. భద్రతా సిబ్బంది అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ, మరుసటి రోజు పరిస్థితిని సమీక్షించడానికి వెళ్లిన ‘జెన్ జీ’యువ సామాజిక కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి, పలువురిని అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ లాఠీఛార్జ్‌లో ఒక నిరసనకారుడి ముఖానికి తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించారు.

పోలీసుల చర్యలపై నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు గగన్ కుమార్ థాపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులను ఖండిస్తూ, అదుపులోకి తీసుకున్న వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఆదివారం నాడు కోశి ప్రాంతంలోని మోరంగ్ జిల్లా పోలీసు కార్యాలయం వెలుపల శాంతియుతంగా నిరసన తెలుపుతున్న 26 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివాదానికి ప్రధాన కారణం ఇదే..
ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన నివాసాల ఖాళీ ప్రక్రియే ప్రస్తుత వివాదానికి కారణం. ఏప్రిల్ నెలలో కాఠ్మాండు లోయతో పాటు నేపాల్‌లోని ఇతర ప్రాంతాలలో ఉన్న పేదల బస్తీలను అధికారులు ఖాళీ చేయించారు. దీనివల్ల సుమారు 2,600 కుటుంబాలకు చెందిన 15,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరిలో వందలాది మందిని తాత్కాలిక కేంద్రాలకు తరలించిన ప్రభుత్వం, జూలై 6 లోగా వాటిని కూడా ఖాళీ చేయాలని ఆదేశించింది. అయితే, శాశ్వత పునరావాస ప్రణాళిక ఏదీ లేకపోవడంతో డజన్ల కొద్దీ కుటుంబాలు ఇప్పటికీ ఆ తాత్కాలిక కేంద్రాల్లోనే మగ్గుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement