1,239 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిక
సీజన్లో ఇదే తొలి ప్రవాహం
నిరాశపరిచిన జూన్.. జూలై, ఆగస్టు పైనే ఆశలు
ఎగువన భారీ వర్షాలు కురిస్తేనే శ్రీశైలం, సాగర్కు వరద
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి ఎట్టకేలకు వరద ప్రారంభమైంది. పశ్చిమ కనుమల్లో వర్షాలు కురవడంతో సోమవారం ఉదయం 6 గంటలకు జలాశయానికి 1,239 క్యూసెక్కుల వరద ప్రారంభమైంది. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొని ఉండడంతో జలాశయానికి ఆలస్యంగా వరద ప్రారంభమైంది. ఆల్మట్టి జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, గతేడాది సరిగ్గా ఇదే సమయానికే నిల్వలు 92.17 టీఎంసీలకు చేరడంతో, గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువన విడుదల చేశారు.
ప్రస్తుతం జలాశయంలో 21.18 టీఎంసీలే నిల్వలే ఉన్నాయి. కృష్ణమ్మ జన్మస్థానమైన మహాబలేశ్వర్(మహారాష్ట్ర)లోని పశ్చిమ కనుమల నుంచి ఆల్మట్టి ప్రాజెక్టు వరకు మధ్యలో ఉన్న 518 కి.మీ.ల పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిస్తేనే ఆల్మట్టి జలాశయం నిండుతుంది. వర్షాలు లేక ఇప్పటికే జూన్ తీవ్ర నిరాశ కల్పించగా, జూలై, ఆగస్టు నెలల్లో భారీ వర్షాలు కురిస్తే ఎగువన కర్ణాటకలోకి ఆల్మట్టితోపాటు నారాయణపూర్, తుంగభద్ర జలాశయాలు నిండి దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి వరద వస్తుంది.
ఆయా జలాశయాల్లో ఇలా...
ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు గతేడాది 99 వేల క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం కేవలం 19 క్యూసెక్కుల నీరే వచ్చింది. జలాశయ గరిష్ట సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 23.78 టీఎంసీలకు నిల్వలు పడిపోయాయి. కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండాలంటే 120 టీఎంసీలకు పైగా వరద రావాలి.
⇒ కృష్ణా ఉపనది భీమాపై మహారాష్ట్రలో ఉన్న ఉజ్జయినీ జలాశయానికి గతేడాది ఇదే సమయానికి 72వేల క్యూసెక్కుల వరద రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు చుక్కనీరు రాలేదు. జలాశయ నిల్వ సామర్థ్యం 123.29 టీఎంసీలు కాగా 49.07 టీఎంసీల నిల్వలున్నాయి.
⇒ కృష్ణా మరో ఉపనది తుంగభద్రపై కర్ణాటకలో ఉన్న తుంగభద్ర జలాశయానికి గతేడాది ఈ సమయానికి 72వేల క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం 1,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయ గరిష్ట సామర్థ్యం 105.78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.38 టీఎంసీలే నిల్వ ఉన్నాయి.
⇒ తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు గతేడాది 1.17లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాగా, ప్రస్తుతం ఎలాంటి వరద రావడం లేదు. జూరాల గరిష్ట నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, 5.85 టీఎంసీల నిల్వలున్నాయి. ప్రస్తుత సీజన్లో ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు 4.13 టీఎంసీల వరద వచ్చి చేరింది.
⇒ శ్రీశైలం జలాశయ గరిష్ట నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 802 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే ఉంది. నిల్వలు 42.21 టీఎంసీలకు తగ్గిపోగా, ప్రస్తుత సీజన్లో జలాశయంలోకి 5.6 టీఎంసీల వరద వచ్చి చేరింది.
⇒ నాగార్జునసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా, 5,224 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 138.39 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ విద్యుదుత్పత్తి ద్వారా 4,168 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


