పుణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలు సియా గోయల్కు మద్దుతుగా నిలుస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అదే క్రమంలో నిందితురాలు సియాను దుమ్మెత్తి పోస్తున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. బలవంతపు పెళ్లి పర్యవసానమే ఇది అంటూ సియాను సమర్థించడానికి ప్రయత్నించిన ఒక నెటిజన్పై నటి, గాయని సుచిత్ర కృష్ణమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. నేరపూరిత ప్రవర్తనను సమర్థించడానికి ఎలాంటి సంస్కృతి లేదా వ్యక్తిగత పరిస్థితులను వాడుకోలేమంటా విమర్శలు గుప్పించారు. అసలు ఏమైంది అంటే...
ప్రియుడితో కలిసి కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను హత్య చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్పై సానుభూతి చూపిస్తూ, ఎక్స్ (ట్విట్టర్)లో ఒక యూజర్ స్పందించారు. బలవంతపు వివాహాల వల్లే ఇలా జరుగుతోందని వ్యాఖ్యానించాడు. ఒకవేళ సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి అమెరికా లేదా యూరప్లో ఉండి ఉంటే, వారు లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉండేవారని, అప్పుడు కేతన్ అగర్వాల్ ఈ కథలోకి వచ్చేవాడే కాదని పేర్కొన్నాడు. దీనిపై సుచిత్ర కృష్ణమూర్తి ఘాటుగా స్పందించారు.
నటి సుచిత్ర కృష్ణమూర్తి కౌంటర్
ఒకవేళ సియాపై పెళ్లికి ఒత్తిడి తెచ్చినప్పటికీ, హింసకు పాల్పడకుండా ఆమెకు అనేక చట్టపరమైన, వ్యక్తిగత మార్గాలు ఉన్నాయంటూ కౌంటరిచ్చారు. "ఏ సంస్కృతి కూడా నేరపూరిత ప్రవర్తనను సమర్థించదు. ఇలాంటి నేరాలను సమర్థించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. ఆమె ఇల్లు వదిలి పారిపోవచ్చు, లేదా తన సమ్మతి లేకుండా బలవంతంగా పెళ్లి చేస్తున్నందుకు కుటుంబంపై కేసు కూడా పెట్టాల్సింది. కానీ, పక్కా ప్రణాళికతో తన కాబోయే భర్తను కొండపై నుండి నెట్టి చంపడం అనేది కేవలం ఒక సైకోపాత్ (ఉన్మాది) మనస్తత్వం మాత్రమే" అంటూ ఎక్స్లో సుచిత్ర విరుచుకుపడ్డారు.
ఇదీ చదవండి : కేతన్ హత్య : కోడ్వర్డ్స్ , ఎమోజీలతో సియా ‘సీక్రెట్ చాట్స్’

కాగా జూన్18న లోహగఢ్ కోట దగ్గర ట్రెకింగ్ చేస్తుండగా కేతన్ అగర్వాల్ మరణించాడు. మొదట ఇది ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా భావించి నప్పటికీ, పోలీసుల దర్యాప్తులో ఇదొక ప్రణాళికాబద్ధమైన హత్యగా తేలింది. కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.
ఇదీ చదవండి: ప్రేయసితో కలిసి భార్యను కాల్చి చంపి, నేపాల్ చెక్కేశాడు!


